Ameesha Patel: బ్లాక్బస్టర్ డైరెక్టర్పై మండిపడ్డ పవన్ కళ్యాణ్ హీరోయిన్
ABN , Publish Date - Dec 21 , 2024 | 01:32 PM
పవన్ కళ్యాణ్ 'బద్రి' సినిమాలో 'సరయు'గా తెలుగు తెరకి పరిచయమైన ముద్దుగుమ్మ అమీషా పటేల్. తర్వాత మహేష్ 'నాని', ఎన్టీఆర్ 'నరసింహుడు' వంటి చిత్రాలలో కనిపించి బాలీవుడ్కి షిఫ్ట్ అయ్యింది. తాజాగా ఆమె ఓ బ్లాక్బస్టర్ డైరెక్టర్పై వరుస ట్వీట్లతో విరుచుకుపడుతోంది. ఇంతకీ ఏమైందంటే..
గతేడాది రిలీజై బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమా 'గదర్ 2'. ఈ సినిమాలో సన్నీ డియోల్, అమీషా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించగా అనిల్ శర్మ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా దర్శకుడు, హీరోయిన్ ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకున్నారు. హీరోయిన్ అమీషా పటేల్ వరుస ట్వీట్లతో దాడికి దిగింది. దీంతో బాలీవుడ్ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
'గదర్ ఏక్ ప్రేమ్ కథ' సీక్వెల్ గా తెరకెక్కిన 'గదర్ 2' సినిమాలో మొదటగా అమీషా పటేల్ ని అత్త పాత్రకి అడిగారట దర్శకుడు అనిల్. ఇదే విషయాన్నీ ఓ ప్రముఖ మీడియా ఛానెల్ తో చెబుతూ.. " అత్త పాత్ర చేయడానికి అమీషా అంగీకరించలేదు. నర్గీస్ దత్ వంటి గొప్ప తారలు కూడా చిన్న వయసులోనే అత్తయ్య పాత్రలు చేశారని ఎంతో నచ్చజెప్పా. అయినా ఆమె మాత్రం చేయనని చెప్పేసింది" అన్నారు.
ఈ ఇంటర్వ్యూ వైరల్ కావడంతో అమీషా స్పందిస్తూ.. "డియర్ అనిల్. ఇది కేవలం సినిమా మాత్రమే. నిజ జీవితంలో ఒక కుటుంబానికి సంబంధించిన విషయం కాదు. కాబట్టి, ఆన్లైన్ ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది. మీరంటే నాకెంతో గౌరవం ఉంది. 'గదర్' కోసమనే కాదు.. ఏ చిత్రం కోసమైనా నేను అత్త పాత్రలు చేయను. రూ.100 కోట్లు ఇచ్చినా ఆ పాత్ర చేయడానికి అంగీకరించను" అంటూ ఘాటుగా స్పందించారు.
అంతకు ముందు కూడా అనిల్పై మండిపడ్డారు. 'గదర్ 2' సినిమాలో తన కుమారుడు ఉత్కర్ష్ శర్మ పాత్రని హైలెట్ చేయడం కోసం సినిమా క్లైమాక్స్నే ఛేంజ్ చేశాడని ఆరోపించింది. 'గదర్ 2' సినిమాని రూ. 60 కోట్ల బడ్జెట్తో నిర్మించగా బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లు కొల్లగొట్టింది. త్వరలోనే 'గదర్ 3' కూడా సెట్స్ పైకి వెళ్లనుంది.