RK Roja : కృష్ణంరాజు విషయంలో రోజా మాటలు హుష్‌ కాకేనా?

ABN , First Publish Date - 2023-09-12T17:17:10+05:30 IST

సీనియన్‌ నటుడు, రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు మరణించి ఈ నెల 11వ తేదికి ఏడాది పూర్తయింది. ఆయన్ను గుర్తు చేసుకుని అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా కన్నీరుమున్నీరయ్యారు. టూరిజం శాఖ మంత్రి ఆర్‌.కె రోజా కృష్ణంరాజు సంస్మరణ సభలో పాల్గొని ప్రభుత్వం తరఫున ఇచ్చిన హామీలను మొగల్తూరు వాసులు, రెబల్‌స్టార్‌ అభిమానులు గుర్తు చేశారు.

RK Roja : కృష్ణంరాజు విషయంలో రోజా మాటలు హుష్‌ కాకేనా?

సీనియన్‌ నటుడు, రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు మరణించి ఈ నెల 11వ తేదికి ఏడాది పూర్తయింది. ఆయన్ను గుర్తు చేసుకుని అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా కన్నీరుమున్నీరయ్యారు. ‘రెబల్‌స్టార్‌’గా మీరెప్పుడు మా హృదయాల్లో ఓ తీపి జ్ఞాపకంలా ఉండిపోతారు’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతోపాటు మరో విషయాన్ని కూడా నెటిజన్లు లేవనెత్తారు. Ap అధికార ప్రభుత్వానికి సంబంధించిన టూరిజం శాఖ మంత్రి ఆర్‌.కె రోజా (Tourism Minister Roja) కృష్ణంరాజు సంస్మరణ సభలో పాల్గొని ప్రభుత్వం తరఫున ఇచ్చిన హామీలను మొగల్తూరు వాసులు, రెబల్‌స్టార్‌ అభిమానులు గుర్తు చేశారు.

ఆ రోజు (Ap Minister Roja) సంస్మరణ సభలో మంత్రి రోజా చెప్పుకొచ్చిన మాటలివి. ‘‘రాజకీయాల్లో ఉండి మంచివారనే పేరు తెచ్చుకోవడం చాలా అరుదు. ఆ ఘనత కృష్ణంరాజుగారికి దక్కింది. ఆయన సినిమాల్లోనే రెబల్‌స్టార్‌. బయట సున్నిత మనస్కుడు. ఆయనకు వారసుడిగా సినిమాల్లో అడుగుపెట్టిన ప్రభాస్‌ భారతదేశం గర్వించే స్థాయికి ఎదిగారు. కృష్ణంరాజును ప్రేమించే అందరికీ ఆయనలా ఈ ప్రాంతానికి అండగా ఉండాలని ప్రభాస్‌ని కోరుతున్నా. అలాగే పశ్చిమగోదావరి జిల్లా తీర ప్రాంతంలో కృష్ణంరాజు పేర స్మృతివనం ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తుంది. ఆ ప్రాంతం ఆయన పేర స్మృతి వనాన్ని ఏర్పాటు చేసి టూరిజం స్పాట్‌గా అభివృద్ది చేస్తాం. ఇదే విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపాము’’ అని పేర్కొన్నారు. ఇప్పుడే అదే విజయాన్ని గోదావరి జిల్లా వాసులు, కృష్ణంరాజు, ప్రభాస్‌ ఫ్యాన్‌ రోజాను ప్రశ్నిస్తు పోస్ట్‌లు పెడుతున్నారు. కృష్ణంరాజు దిన కార్యక్రమానికి వచ్చి గొప్పలు చెప్పి, హామీలు ఇచ్చిన రోజా మళ్లీ ఆ ప్రస్తావన తీసుకు రాలేదని, అసలు ఆ సంగతి గుర్తుందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి అంటూ రోజాపై విరుచుకుపడుతున్నారు. (Where is Krishnam raju Smruthi Vanam)

కృష్ణంరాజు (Krishnam raju) స్మృతి వనానికి రెండెకరాల భూమిని కేటాయించారా? దానికి సంబంధించిన పనులు ఏమన్నా ప్రారంభమయ్యాయా? అని మొగల్తూరు వాసులను అడగ్గా.. ‘అసలు అలాంటి ప్రస్తావనే ఇక్కడ లేదు.. ఇంక రెండెకరాల భూమి ఎక్కడి నుంచి వస్తుంది? అంటూ సమాధానమిచ్చారు. ఇదే ప్రశ్న అక్కడి రెవెన్యూ అధికారులను అడగగా వారు కూడా పెదవి విరిచారని కృష్ణంరాజు అత్యంత సన్నిహితులైన వారి ద్వారా తెలిసింది. నరసాపురం, మొగల్తూరు అనే కాదు ఉభయ గోదావరి జిల్లాల్లో కృష్ణంరాజుకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఆయన పేరున స్మృతి వనం అని ప్రకటించి ఇప్పుడు ఆ ప్రస్తావనే లేకపోవడంతో ‘ఈ చర్య కృష్ణంరాజును అవమానించినట్లేనని’ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కొందరైతే ‘మంత్రి రోజాగారూ స్మృతి వనం ఎక్కడా? ‘నాకు స్మృతివనం కావాలి’ అని కృష్ణంరాజుగారు కలలో కనిపించి అడిగినట్లుగా ఆ రోజు ప్రకటనలు చేశారు. చేయలేని పనులు గురించి మీరెందుకు మాట్లాడతారు. జబర్దస్‌ కామెడీ టీవీలో చేసుకో.. పేరున్న వారి విషయంలో కాదు’’ అని గోదావరి వెటకారంతో రోజాపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అయితే రోజా ఈ ప్రకటన చేసిన సమయంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తీర ప్రాంతంలో కృష్ణంరాజు పేర స్మృతివనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని కొందరు స్వాగతిస్తే.. మరికొందరు విమర్శించారు.. కృష్ణంరాజు సేవలకుగానూ స్మృతివనం ఏర్పాటు ఆలోచన మంచిదేనని ఆ సమయంలో కొందరు ప్రశంసించారు. కొందరు మాత్రం వైసీపీ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో రాజుల ఓట్ల కోసమే ఈ ప్రకటన చేశారనే వార్తలు అప్పుడే నెట్టింట హల్‌చల్‌ చేశాయి. కృష్ణంరాజు పేరుతో వచ్చే ఎన్నికల్లో రాజులకు మంత్రి రోజా ద్వారా వైసీపీ సర్కారు ఇలా ఎర వేస్తోందనే మాటలు వినిపించాయి.

Updated Date - 2023-09-12T17:17:10+05:30 IST