Vijay Devarakonda : వంద కుటుంబాలకు రూ. లక్ష చొప్పున.. అలా చేయకపోతే నేను వేస్ట్‌!

ABN , First Publish Date - 2023-09-05T12:27:31+05:30 IST

విజయ్‌ దేవరకొండ మరోసారి ఉదారత చాటుకున్నారు. ‘ఖుషి’ సినిమా ద్వారా తాను సంపాదించిన మొత్తంలో రూ.కోటిని వంద కుటుంబాలకు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో ఆయన ఈ ప్రకటన చేశారు.

Vijay Devarakonda : వంద కుటుంబాలకు రూ. లక్ష చొప్పున.. అలా చేయకపోతే నేను వేస్ట్‌!

విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) మరోసారి ఉదారత చాటుకున్నారు. ‘ఖుషి’ (kushi) సినిమా ద్వారా తాను సంపాదించిన మొత్తంలో రూ.కోటిని వంద కుటుంబాలకు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో ఆయన ఈ ప్రకటన చేశారు. విజయ్‌, సమంత జంటగా దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ‘ఖుషి’ చిత్రం ఈ నెట ఒకటో తేదీన విడుదలై సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ.50 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఓవర్సీస్‌లోనూ సినిమా సంచలనం సృష్టిస్తోంది. ఈ సందర్భంగా వైజాగ్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో విజయ్‌ మాట్లాడుతూ...

‘‘సోషల్‌ మీడియాలో నాపె, నాపైౖ పెద్ద యుద్ధమే జరుగుతోంది. కొందరు డబ్బులిచ్చి మరీ మా సినిమాపై నెగెటివిటీ న్యూస్‌ రాయిస్తున్నారు. ఫేక్‌ రేటింగ్స్‌, యూట్యూబ్‌ ఫేక్‌ రివ్యూలనూ దాటుకుని సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతుందంటే కారణం అభిమానుల ప్రేమే. ఈ ఎనర్జీ చూస్తుంటే ఇప్పుడు దాని గురించి మాట్లాడాలనిపించడంలేదు. ఈ ఆనంద సమయంలో నెగటివిటీ గురించి ఎందుకు? అబిమానులు ముఖంలో ఆనందం చూడాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నా. ఈ చిత్రంతో ఆ కోరిక నెరవేరింది. డబ్బు సంపాదించాలి, అమ్మ, నాన్నలను బాగా చూసుకోవాలి. సమాజంలో గౌరవం ఉండాలి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే నేనెప్పుడూ పనిచేస్తుంటా. కానీ, ఇప్పటి నుంచి మీకోసం పని చేయాలనుకుంటున్నా. మీరూ ఆనందంగా ఉండాలి. వ్యక్తిగతంగా ఒక్కొక్కరినీ కలిసి ‘ఖుషి’ని సెలబ్రేట్‌ చేసుకోవాలనుంది కానీ అది వీలుపడదు. అందుకే వంద కుటుంబాలను ఎంపిక చేసి ఇక నుంచి నా సంపాదన నుంచి రూ.కోటిని వారికి అందించాలనుంది. ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున పది రోజుల్లో అందచేస్తా. మనమంతా దేవర ఫ్యామిలీ. నా ఆనందం, సంపాదనను మీతో పంచుకోకపోతే వేస్ట్‌. నేను అనుకున్న ఈ పని పూర్తయినప్పుడు ‘ఖుషి’ విషయంలో తృప్తిగా ఉంటా. వివరాల కోసం సంబంధిత ఫామ్స్‌ని సోషల్‌ మీడియాలో మంగళవారం పోస్ట్‌ చేస్తాం’’ అని తెలిపారు.

Updated Date - 2023-09-05T12:30:12+05:30 IST