Bholaa Shankar: చిరంజీవి సినిమా నిర్మాతలపై క్రిమినల్ కేసు నమోదు

ABN , First Publish Date - 2023-09-16T17:39:52+05:30 IST

విశాఖపట్నంకి చెందిన ఫిలిం డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ 'ఏజెంట్', 'భోళా శంకర్' నిరంతలు అయిన అనిల్ సుంకర మీద క్రిమినల్ కేసులు నాంపల్లి కోర్టులో రిజిస్టర్ అయ్యాయని చెపుతున్నాడు. ఇతనికి నిర్మాత నట్టి కుమార్ అండగా వుంటాను అని చెపుతున్నాడు. ఈరోజు వీరిద్దరూ తమ అడ్వకేట్ తో మీడియాతో మాట్లాడేరు

Bholaa Shankar: చిరంజీవి సినిమా నిర్మాతలపై క్రిమినల్ కేసు నమోదు
A still from Bholaa Shankar

చిరంజీవి (Chiranjeevi), తమన్నా (Tamannah) జంటగా నటించిన 'భోళాశంకర్' #BholaaShankar సినిమా ఈమధ్యనే విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాపు అయింది. ఈ సినిమాకి మెహెర్ రమేష్ (MeherRamesh) దర్శకుడు కాగా, అనిల్ సుంకర (AnilSunkara) నిర్మాత. ఇందులో కీర్తి సురేష్ (KeerthySuresh), చిరంజీవి చెల్లెలుగా నటించింది. ఈ సినిమా నిర్మాతకి విశాఖపట్నం కి చెందిన ఫిలిం డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణకు (BathulaSatyanarayana) గతంలో న్యాయపరమైన వాదనలు జరిగిన విషయం తెలిసిందే. 'భోళా శంకర్' నిర్మాత అయిన (VizagSatish) అనిల్ సుంకర ఇంతకు ముందు అఖిల్ అక్కినేనితో, సురేందర్ రెడ్డి దర్శకుడిగా 'ఏజెంట్' అనే సినిమాని కూడా నిర్మించారు. ఆ సినిమా కూడా ఒక డిజాస్టర్ మూవీ అయింది.

ఆ సినిమాకి సంబంధించి హైదరాబాద్ లోని నాంపల్లి క్రిమినల్ కోర్టులో చీటింగ్ తో పాటు వివిధ కేసులు నమోదు చేసినట్టుగా బత్తుల సత్యనారాయణ లేదా సతీష్ ఈరోజు వెల్లడించారు. అఖిల్ హీరోగా నటించిన 'ఏజెంట్" సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో తనను మోసం చేశారని, ఆ సినిమాకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి మూడు రాష్ట్రాల హక్కుల కోసం 30 కోట్ల రూపాయలు వైట్ అమౌంట్ ను బ్యాంకు ద్వారా తాను చెల్లించడం జరిగిందని, అయితే తనకు కేవలం విశాఖపట్నం వరకే హక్కులను ఇచ్చారని శనివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (సతీష్) వెల్లడించారు.

ఈ నేపధ్యంలో తాను వెళ్లి నిర్మాతలను సంప్రదించగా, 'భోళా శంకర్" సినిమా విడుదలకు ముందు తన డబ్బులు తిరిగి చెల్లిస్తామని అండర్ స్టాండింగ్ లెటర్ ఇచ్చారని సతీష్ వివరించారు. గత పదమూడేళ్లుగా వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ గా 'రంగస్థలం' వంటి అనేక పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన తనకు సినీ పరిశ్రమతో ఉన్న అనుబంధం వల్ల తనకు రావలసిన డబ్బుల విషయంలో ఆచితూచి వ్యవహరించానని, అయితే వారు తనను పట్టించుకోలేదని, తనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదని, దాంతో తన డబ్బుల రికవరీ కోసం కోర్టును ఆశ్రయించడం జరిగిందని అన్నారు.

vizagsatish1.jpg

నేను చెల్లించిన 30 కోట్ల రూపాయల డబ్బును రికవరీ చేసుకునేందుకు సూట్ ఫైల్ చేసుకోమని హైదరాబాద్ సివిల్ కోర్టు అనుమతినిచ్చిందని , ఆ మేరకు న్యాయ పోరాటం చేస్తున్నామని సతీష్ స్పష్టం చేశారు. మరోవైపు నాంపల్లి క్రిమినల్ కోర్టులో సదరు నిర్మాతలపై వివిధ సెక్షన్స్ కింద క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయ్యాయని ఆయన చెప్పారు. అతని తరపున వాదిస్తున్న అడ్వొకేట్ కేశాపురం సుధాకర్ మాట్లాడుతూ, బత్తుల సత్యనారాయణ (సతీష్) ను మోసం చేసిన వారిపై న్యాయస్థానంలో సివిల్ కేసులకు సంబందించిన వాదనలు కొనసాగుతున్నాయని అన్నారు. నాంపల్లి క్రిమినల్ కోర్టులో సతీష్ ను మోసం చేసిన 'భోళాశంకర్' నిర్మాతలు అనిల్ సుంకర (AnilSunkara), రామబ్రహ్మం సుంకర (RamabrahmamSunkara), ఇంకా వారి సంస్థకు చెందిన గరికపాటి కిషోర్ (GarikipatiKishore) పై కుట్ర, చీటింగ్, నమ్మకద్రోహం,వంటి వివిధ సెక్షన్స్ కింద కేసులు రిజిస్టర్ అయ్యాయని ఆయన తెలిపారు.

సతీష్ కి అండగా నిర్మాత నట్టికుమార్ (NattiKumar) మాట్లాడారు. అతని నిర్మాతల మండలి లాంటివి కనీసం పట్టించుకోకపోవటం బాధగా ఉందని చెప్పారు. నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ వంటివి మోసపోయిన వారి వైపు కాకుండా, మోసం చేసిన వారికి సపోర్ట్ గా నిలుస్తుండటం చాలా భాధను కలిగిస్తోంది. నాకు మంచి మిత్రుడైన వైజాగ్ సతీష్ కూడా వాటి చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో న్యాయస్థానంకు వెళ్లారు. రూ. 30 కోట్లు చెల్లించి, సదరు నిర్మాతల చేతిలో మోసపోయిన సతీష్ కు న్యాయం జరగడం కోసం నేను తనవైపు సపోర్ట్ గా నిలిచాను. సదరు నిర్మాతలు ఐటీ, జీఎస్టీ వంటివి కట్టకుండా, చాలాకాలంగా గవర్నమెంట్ ను మోసం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. వాటి అన్నింటిపైనా ఫిర్యాదులు చేయబోతున్నాం. సతీష్ కు పూర్తి న్యాయం జరిగేంతవరకు ఎంతదూరమైనా వెళతాం. ఇప్పటికే నాంపల్లి క్రిమినల్ కోర్టులో కేసులు రిజిస్టర్ అయ్యాయి. అలాగే సివిల్ కోర్టులో మెయిన్ కేసు కొనసాగుతోంది.

Updated Date - 2023-09-16T18:48:28+05:30 IST