Vishal : అంతా అవినీతిమయం.. విశాల్ ఫైర్ 

ABN , First Publish Date - 2023-09-29T10:35:04+05:30 IST

సినిమాలకు సెన్సార్‌ చేసే సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ కార్యాలయం అవినీతిమయం అయిపోయిందని హీరో విశాల్‌ (Vishal) అన్నారు.

Vishal :  అంతా  అవినీతిమయం.. విశాల్ ఫైర్ 

సినిమాలకు సెన్సార్‌ చేసే సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (Central Board of Film Certification) కార్యాలయం అవినీతిమయం అయిపోయిందని హీరో విశాల్‌ (Vishal) అన్నారు. అయన హీరోగా నటించిన తాజా చిత్రం  ‘మార్క్‌ ఆంటోని’ (Mark Antony) విషయంలో తనకు ఎదురైన సమస్య గురించి చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఎక్స్‌’ (ట్విట్టర్)  వేదికగా ఓ పోస్ట్‌ చేశారు.  ‘‘అవినీతి గురించి తెరపై చూడడం ఓకే గానీ నిజ జీవితంలో జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువగా ఉంది. ముంబై  సెన్సార్‌ ఆఫీస్‌లోనూ ఇది జరుగుతోంది. ‘మార్క్‌ ఆంటోని’ సినిమా హిందీ వెర్షన్‌ సెన్సార్‌ చేయడానికి సంబంధిత అధికారులకు రెండు దఫాలుగా రూ. 6.5 లక్షలిచ్చా స్క్రీనింగ్‌ కోసం రూ. 3.5 లక్షలు, సర్టిఫికెట్‌ కోసం రూ. 3 లక్షలు రెండు ఖాతాల్లో జమ చేశా .  నటుడిగా ఇన్నేళ్ల కెరీర్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. తప్పని పరిస్థితుల్లో  డబ్బులివ్వాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఏ నిర్మాతకూ ఇలాంటి కష్టం రాకూడదు.  కష్టపడి సంపాదించిన డబ్బు ఈ విధంగా పోయే అవకాశమే లేదు! న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే దృష్టికి తీసుకెళ్తాను" అన్నారు విశాల్.  ఈ మేరకు ఆ ఇద్దరి ‘ఎక్స్‌’ ఖాతాలను ట్యాగ్‌ చేశారు. డబ్బులు ఎవరికి పంపించారో వారి పేరు, బ్యాంక్‌ ఖాతా వివరాలనూ ట్వీట్లో పేర్కొన్నారు. 

విశాల్‌, ఎస్‌.జె. సూర్య ప్రధాన పాత్రల్లో దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌ తెరకెక్కించిన చిత్రమిది. టైమ్‌ ట్రావెల్‌ ఇతివృత్తంతో  రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళంలో ఈ నెల 15న విడుదలైంది. హిందీలో ఈ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీనికి సంబంధించి సెన్సార్‌ చేయించే క్రమంలోనే అధికారులు లంచం తీసుకున్నారని విశాల్‌ ఆరోపించారు.

Updated Date - 2023-09-29T10:41:53+05:30 IST