Samuthirakani Fire : 16 ఏళ్ల క్రితం గొడవ ఇంకా సద్దుమణగలేదు

ABN , First Publish Date - 2023-11-26T12:55:52+05:30 IST

నటుడు దర్శకనిర్మాత సముద్రఖని నిర్మాత జ్ఞానవేల్‌ రాజాపై ఫైర్‌ అయ్యారు. నీకింత ధైర్యమెక్కచిది. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్‌ అంటూ మండిపడ్డారు.

Samuthirakani Fire : 16 ఏళ్ల క్రితం గొడవ ఇంకా సద్దుమణగలేదు

నటుడు దర్శకనిర్మాత సముద్రఖని (Samuthirakani ) నిర్మాత జ్ఞానవేల్‌ రాజాపై (KE Jnanavel raja) ఫైర్‌ అయ్యారు. 'నీకింత ధైర్యమెక్కడిది . నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్‌' అంటూ మండిపడ్డారు. అసలు విషయంలోకి వెళ్తే... కార్తి హీరోగా పరిచయమైన చిత్రం ‘పరుత్తివీరన్‌’. ఈ చిత్రం వచ్చి దాదాపు 16 ఏళ్లు అవుతోంది. అయితే అప్పటినుంచి దర్శకుడు ఆమిర్‌, నిర్మాత జ్ఞానవేల్‌ రాజాకు మధ్య వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమిర్‌కు మద్దతుగా సముద్రఖని తాజాగా ఓ లేఖ రాశారు.

‘‘పరుత్తివీరన్‌’ సినిమాలో నేనూ నటించాను. ఆ సినిమా తెరకెక్కుతున్న సమయంలో దర్శకుడు ఆమిర్‌ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అవన్నీ నేను కళ్లారా చూశాను. నిర్మాతగా నువ్వు (జ్ఞానవేల్‌ రాజా) మాత్రం ఒక్కరోజు కూడా సెట్‌కు వచ్చింది లేదు. బడ్జెట్‌ విషయంలో సహకరించలేదు. నా దగ్గర డబ్బు లేదంటూ ఈ సినిమా చేయనని షూటింగ్‌ మధ్యలో చేతులెత్తేశావు. బంధువుల దగ్గర అప్పు తెచ్చి ఆమిర్‌ ఆ సినిమా పూర్తి చేశాడు. దానికి నేనే సాక్ష్యం. ఎంతో కష్టపడి అతను సినిమా పూర్తి చేస్తే.. నిర్మాత అనే పేరు మాత్రం నువ్వు పొందావు. ఈరోజు నువ్వు దర్శకుడిని తప్పుబడుతూ వ్యాఖ్యలు  చేస్తున్నావు. ఇది కరెక్ట్‌ కాదు. తప్పు చేసిన నీకు ఇంత ధైర్యం ఎక్కడిది? మళ్ళీ మళ్లీ తప్పు చేస్తున్నావు’’ అని సముద్రఖని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ లేఖ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

కార్తి హీరోగా నటించిన 25 చిత్రం ‘జపాన్‌’కు కె.ఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మాతగా వ్యవహరించారు. ఈ నెల ప్రారంభంలో చెన్నై జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకకు కార్తితో ఇప్పటివరకూ సినిమాలు చేసిన దర్శకులందరూ హాజరయ్యారు. అయితే, తొలి చిత్ర దర్శకుడు ఆమిర్‌ మాత్రం ఈ వేడుకలో కనిపించలేదు. దీనిపై ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘జపాన్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు నాకు పిలుపు లేదు. సూర్య - కార్తితో నాకు సత్సంబంధాలు లేవు. జ్ఞానవేల్‌ రాజా మా మధ్యలోకి రావడంతోనే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జ్ఞానవేల్‌ రాజా స్పందిస్తూ.. ‘‘అతడికి ఆహ్వానం పంపించాం. ‘పరుత్తివీరన్‌’ విషయంలో నన్ను ఇబ్బందిపెట్టాడు. అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టించాడు. సరైన లెక్కలు చూపించకుండా నా డబ్బు దోచుకున్నాడు’’ అని ఆరోపణలు చేశాడు. దీంతో వీరిద్దరి వివాదం ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. దర్శకుడు ఆమిర్‌కు మద్దతుగా సముద్రఖని ట్విట్టర్‌ వేదికగా ఓ లేఖను పోస్ట్‌ చేశారు.

Updated Date - 2023-11-26T13:37:00+05:30 IST