Valentine's Day: ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లిన టాలీవుడ్ హీరోలు వీరే..

ABN , First Publish Date - 2023-02-14T13:46:52+05:30 IST

పూర్వకాలంలో ప్రేమికుల రోజు (Valentine's Day) అనేది ప్రత్యేకంగా లేకపోవచ్చు. కానీ ప్రేమ మాత్రం ఎప్పుడూ ఉంది.

Valentine's Day: ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లిన టాలీవుడ్ హీరోలు వీరే..
Valentines Day

పూర్వకాలంలో ప్రేమికుల రోజు (Valentine's Day) అనేది ప్రత్యేకంగా లేకపోవచ్చు. కానీ ప్రేమ మాత్రం ఎప్పుడూ ఉంది. భూమ్మీద మానవాళి మనుగడ మొదలైన దగ్గర్నించీ ప్రేమ ఉంది. సృష్టి అంతమయ్యేదాకా ఇది ఉంటుంది. యుక్త వయస్సుకి వచ్చిన తర్వాత చాలామందిలో ప్రేమ పుడుతుంది. అయితే పెళ్లి వరకూ వెళ్లేది మాత్రం కొన్ని జంటలే. ఈ ప్రేమికుల రోజు సందర్భంగా టాలీవుడ్‌లో ప్రేమ వివాహాలు చేసుకున్న స్టార్ల గురించి తెలుసుకుందాం..

మహేష్ బాబు- నమ్రత (Mahesh babu - Namrata)

‘వంశీ’ సినిమాతో మహేష్ బాబు- నమ్రత శిరోద్కర్ మధ్య ఏర్పడిన పరిచయం వీరిని పెళ్లి దాకా నడిపించింది. అయితే అప్పట్లో మీడియా ప్రభావం పెద్దగా లేకపోవడంతో వీరి పెళ్లికి సంబంధించిన వివరాలు జనానికి పెద్దగా తెలియలేదు. 2000 సంవత్సరంలో ఈ సినిమా సమయంలో మహేష్- నమ్రత మధ్య స్నేహం చిగురించింది. అనంతరం ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. అలా 2005 ఫిబ్రవరి 10న మహేష్- నమ్రత ఒక్కటయ్యారు. అయితే మొదట వీరి పెళ్లికి కృష్ణ ఒప్పుకోలేదని టాక్ నడిచింది. కానీ మహేశ్ సోదరి మంజులనే ఆయన కుటుంబాన్ని ఒప్పించిందట. అనంతరం అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరిగింది. ఈ జంటకి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు. ఈ ఏడాదికి వీరి వివాహం జరిగి 18 ఏళ్లు నిండాయి.

mahesh.jpg

అల్లు అర్జున్ - స్నేహ (Allu Arjun-Sneha)

చదువు కొనసాగుతుండగానే అల్లు అర్జున్ సినిమాలపై ఆసక్తితో డాడీ సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. అనంతరం ‘గంగ్రోత్రి’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఇటీవల వచ్చిన ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. మరోవైపు స్నేహలత రెడ్డి హైదరాబాద్‌లోనే డిగ్రీ పూర్తి చేసి అమెరికాలో ఎమ్మెస్ చేసింది. అనంతరం కుటుంబానికి ఉన్న కొన్ని కాలేజీ పనులను చూసుకుంది. ఆ సమయంలోనే ఓ ఫంక్షన్‌లో స్నేహని చూసిన బన్నీ లవ్‌లో పడిపోయాడు. అనంతరం కుటుంబ సభ్యులను ఒప్పించి మార్చి 11, 2011న వివాహ చేసుకోగా.. వీరికి అయాన్, ఆర్హా అనే ఇద్దరు పిల్లలు కలిగారు. గతేడాది 11వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.

allu-arjun.jpg

రామ్‌చరణ్ - ఉపాసన (Ram Charan - Upasana)

టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ రొమాంటిక్ కపుల్స్‌లో రామ్ చరణ్, ఉపాసన జంట కచ్చితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కూడా తెలుగు రాష్ట్రాల్లోని ప్రఖ్యాత కుటుంబాలకు చెందిన వారసులు. మెగాస్టార్ చిరంజీవి తనయుడైన రామ్‌చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి మనవరాలే ఉపాసన. ఆ హాస్పిటల్స్‌లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్‌గా ఉపాసన బాధ్యతల్ని నిర్వర్తిస్తోంది. ఈ జంట మధ్య చాలా ఏళ్ల క్రితం ఒక స్పోర్ట్స్ క్లబ్‌లో పరిచయం జరిగింది. అది స్నేహానికి దారి తీసి.. అనంతరం ప్రేమగా మారింది. ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట పెద్దల అంగీకారంతో 2012 జూన్ 14న పెళ్లిబంధంతో ఒకటైంది.

ramcharan.jpg

నాని- అంజన (Nani-Anjana)

లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్న టాలీవుడ్ హీరోల్లో నాని కూడా ఉన్నారు. అయితే ఈయనది ప్రత్యేక కేటగిరీ కిందకు వస్తుంది. ఎందుకంటే.. ఈయనది ఫేస్‌బుక్ ప్రేమ. ఆయన భార్య అంజన వాళ్లది సైంటిస్ట్ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ. వారిద్దరికీ నాని కెరీర్ తొలినాళ్లలో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అనంతరం అది ప్రేమగా మారింది. అయితే సినిమా రంగంలో ఉన్న నానికి అమ్మాయిని ఇవ్వడానికి అంజన తల్లిదండ్రులు మొదట కొంచెం భయపడ్డారు. కానీ ఇద్దరూ కలిసి వారిని ఒప్పించి మ్యారేజ్‌ 2012లో పెద్దల సమక్షంలో నాని- అంజన వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంటకి జున్ను అనే కుమారుడు ఉన్నాడు.

nanu.jpg

రానా దగ్గుబాటి - మిహికా బజాజ్ (Rana Daggubati-Meehika Bajaj)

‘బాహుబలి’ సినిమాతో రానాకి బాలీవుడ్‌లో పాపులారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే రానా బాలీవుడ్‌లో పలు సినిమాలు చేశాడు. అందుకే అక్కడి సినీ ప్రముఖులు రానాకి పరిచయమే. అదే సమయంలో మిహికా బజాజ్‌కి మంచి ఇంటీరియర్ డిజైనర్‌గా పేరుండేది. ఆమెకీ బాలీవుడ్ నటులతో మంచి పరిచయాలే ఉండేవి. ఈ తరుణంలోనే వారిద్దరికీ పరిచయమై స్నేహంగా మారి.. ప్రేమ చిగురించింది. కొన్నేళ్లు ప్రేమలో ఉన్న ఈ జంట కరోనా సమయంలోనే ఇరు కుటుంబ పెద్దలను ఒప్పించి ఆగస్టు 8, 2020న వివాహం చేసుకున్నారు. కరోనా కావడంతో చాలా సింపుల్‌గా వీరి వివాహం జరిగింది.

rana.jpg

నిఖిల్ సిద్ధార్థ - పల్లవి (Nikhil Siddhartha - Pallavi)

చాలా ఏళ్ల క్రితమే కామన్ ప్రెండ్స్ ద్వారా నిఖిల్ సిద్ధార్థ, పల్లవికి పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో నిఖిల్ అప్పుడప్పుడే కెరీర్‌లో సెటిల్ అవుతున్నాడు. అప్పుడు బెంగళూరులో మెడిసిన్ చేస్తోంది. ఆ పరిచయంలో పల్లవి నడవడిక తనకి బాగా నచ్చేసిందని నిఖిల్ ఓ సందర్భంలో తెలిపాడు. అందుకే స్నేహితుల దగ్గర నెంబర్ తీసుకుని తనతో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం గోవా టూర్‌కి వెళ్లినప్పుడు సినిమా టైపులో పల్లవికి నిఖిల్ ప్రపోజ్ చేశాడు. మొదట సర్‌ప్రైజ్ అయినా ఆమె తన తల్లిదండ్రులతో మాట్లాడమని చెప్పింది. అయితే వారు మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డారట. అనంతరం ఇరు కుటుంబాలను ఒప్పించిన ఈ జంట మే 14, 2020న వివాహ బంధంతో ఒకటైంది.

nikhil.jpg

Updated Date - 2023-02-14T13:58:38+05:30 IST