Adnan Sami: జగన్ ‘ఆర్ఆర్ఆర్’ ట్వీట్‌పై టాప్ సింగర్ అభ్యంతరం

ABN , First Publish Date - 2023-01-11T18:53:03+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్‌రెడ్డి ఆర్ఆర్ఆర్ చిత్ర బృందాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. ఈ ట్వీట్‌పై టాప్ సింగర్ అద్నాన్ సమీ (Adnan Sami) అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశం నుంచి వేరుగా ఉండటానికి ప్రయత్నించకండి అని తెలిపారు.

Adnan Sami: జగన్ ‘ఆర్ఆర్ఆర్’ ట్వీట్‌పై టాప్ సింగర్ అభ్యంతరం

దర్శకధీరుడు ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తాజాగా గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని గెలుచుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ (Naatu Naatu) అవార్డును సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్‌రెడ్డి కూడా చిత్ర బృందాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. ఈ ట్వీట్‌పై టాప్ సింగర్ అద్నాన్ సమీ (Adnan Sami) అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశం నుంచి వేరుగా ఉండటానికి ప్రయత్నించకండి అని తెలిపారు.

ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. ‘‘ప్రపంచ వేదికపై తెలుగు పతాకం రెపరెపలాడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున చిత్రబృందానికి నా శుభాకాంక్షలు. మిమ్మల్ని చూసి మేం గర్విస్తున్నాం’’ అని జగన్ తెలిపారు. ఈ ట్వీట్‌‌పై సింగర్ అద్నాన్ సమీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘తెలుగు పతాకమా..? మీరు చెబుతున్నది భారతీయ పతాకమో కదా..? ప్రపంచం విషయానికి వస్తే మనమంతా ఒకే దేశం. మొదట మనం భారతీయులం. దయచేసి మీరు భారత్ నుంచి వేరుగా ఉండటానికి ప్రయత్నించకండి. మనం 1947లో చూసిన వేర్పాటు వాద వైఖరి మంచిది కాదు. ధన్యవాదాలు.. జై హింద్’’ అని అద్నాన్ సమీ తెలిపారు. అద్నాన్ ట్వీట్‌కు నెటిజన్స్ కౌంటర్స్ ఇచ్చారు. ఫలితంగా తన చర్యను సమర్థించుకుంటూ ఆయన మరో పోస్ట్ పెట్టారు. ‘‘తెలుగు సినిమా ఇండియా గర్వపడేలా చేసింది అని రాస్తే బాగుండేది. అది నిజం కూడా ’’ అని మరో పోస్ట్‌ను ఆయన సోషల్ మీడియాలో పెట్టారు. అద్నాన్ సమీ పలు భాషల్లో పాటలు పాడి ఫేమ్‌ను సంపాదించుకున్నారు. ‘శంకర్ దాదా M.B.B.S’, ‘వర్షం’, ‘100%లవ్’ వంటి చిత్రాల్లో పాటలను ఆలపించారు.

Updated Date - 2023-01-11T18:58:56+05:30 IST