James cameron - Titan: హెచ్చరిక సందేశం అందినప్పుడు అలా చేసుంటే బయటపడేవారు!

ABN , First Publish Date - 2023-06-23T16:13:33+05:30 IST

టైటానిక్‌ శకలాలను చూసేందుకు ఐదుగురితో బయలుదేరిన టైటాన్‌ మినీ సబ్‌మెరైన్‌ విచ్ఛిన్నమవడం పట్ల జేమ్స్‌ కామెరూన్‌ విచారం వ్యక్తం చేశారు. సాహసాలు చేయడానికి ముందుండే జేమ్స్‌ కామెరూన్‌ సముద్రంలో మునిగిపోయిన ‘టైటానిక్‌’ షిప్‌ ప్రాంతాన్ని ఇప్పటికి 33సార్లు సందర్శించారట.

James cameron - Titan: హెచ్చరిక సందేశం అందినప్పుడు అలా చేసుంటే బయటపడేవారు!

హాలీవుడ్‌లో సాహసాలకు, ప్రయోగాలకు కేరాఫ్‌ అడ్రస్ట్‌ జేమ్స్‌ కామెరూన్‌ (James cameron). ‘అవతార్‌’, ‘అవతార్‌2’ వంటి చిత్రాలతో 1997లో ‘టైటానిక్‌’ (Titanic) లాంటి చిత్రాన్ని రూపొందించారు. ఆయన తెరకెక్కించిన ప్రతి చిత్రం ప్రత్యేకమే అయినా ‘టైటానిక్‌’ మాత్రం ఎవర్‌గ్రీన్‌ అనే చెప్పాలి. ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ, డెకరేటెడ్‌ షిప్‌ ప్రమాదానికి గురై సముద్ర గర్భంలో ఎలా కలిసిపోయిందనే నేమథ్యానికి ప్రేమకథను జోడించి భావోద్వేగంగా చూపించారు. తాజాగా టైటానిక్‌ శకలాలను చూసేందుకు ఐదుగురితో బయలుదేరిన టైటాన్‌ (Titan mini sub marine) మినీ సబ్‌మెరైన్‌ విచ్ఛిన్నమవడం పట్ల జేమ్స్‌ కామెరూన్‌ విచారం వ్యక్తం చేశారు. సాహసాలు చేయడానికి ముందుండే జేమ్స్‌ కామెరూన్‌ సముద్రంలో మునిగిపోయిన ‘టైటానిక్‌’ షిప్‌ ప్రాంతాన్ని ఇప్పటికి 33సార్లు సందర్శించారట. భూమ్మీద ఉన్న అత్యంత క్రూరమైన ప్రదేశం అదేనని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. తాజా ఘటనపై ఆయన స్పందించారు. ‘టైటానిక్‌ షిప్‌ ప్రమాదం జరిగిన చోట ఆ తరహా ప్రమాదం మళ్లీ జరగడం ఆశ్చర్యపరచిందని ఆయన అన్నారు. (Titan submerine missing)

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ‘‘సముద్ర గర్భంలో ప్రయాణించడం అనేది ఓ సాహసం. అదొక కళ. ఇలాంటి సాహసాలు చేసేప్పుడు కాస్త పరిపక్వత, జాగ్రత్త ఉండాలి. ఆ ప్రమాదం జరిగిన వెంటనే సముద్ర అన్వేషకుల బృందంలో ఒకరు నాకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం ప్రకారం.. ఒక గంటలో ఏం జరిగిందో నేను విశ్లేషించాను. టైటాన్‌తో సంబంధం తెగిపోయిన గంటకు పెద్ద శబ్ధం వినిపించింది. దాన్ని హైడ్రోఫోన్‌ ద్వారా విన్నాం. ఆ తర్వాత ట్రాన్స్‌ పాండర్‌తో సంలింగ్‌ పూర్తిగా కట్‌ అయింది. దాంతో మినీ సబ్‌మెరైన్‌ పేలిపోయి ఉంటుందని గ్రహించా. అలా జరిగినప్పుడు అందులో ఉన్నవారు బతికే అవకాశం లేదని భావించాం. ఘటనా సమయంలో వాళ్లు 3500 మీటర్ల లోతులో ఉన్నారు. ఆ తర్వాత కొద్దిేసపటికే 3800 మీటర్లు అంటే సముద్రం అడుగుకు వెళ్లిపోయి ఉంటారని అనుకున్నాం. టైటానిక్‌ ఘోరం జరిగిన చోటే ఈ ఘటన జరగడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఇదే ప్రాంతంలో ఐస్‌ గడ్డ ఉందని, ఓడ దాన్ని ఢీ కొట్టబోతోందని అప్పటి కెప్టెన్‌ పదే పదే హెచ్చరించాడు. అర్ధరాత్రిలో టైటానిక్‌ ఓడ ఆ భారీ మంచు గడ్డను ఢీ కొట్టి ముక్కలై మునిగిపోయింది. ఫలితంగా వందలమంది ప్రాణాలు సముద్రంలో కలిసిపోయాయి. అలాంటి ప్రమాదకరమైన ప్రాంతంలో అప్రమత్తతో వ్యవహరించాలి. ఓషన్‌ గేట్‌ మినీ సబ్‌మెరైన్‌కు లేటెస్ట్‌ టెక్నాలజీ సెన్సర్లు ఉన్నాయి. ప్రమాదానికి ముందు మెరైన్‌ బాడీకి పగుళ్లు వచ్చి ఉండవచ్చు. ఆ సమయంలో బోట్‌లో ఉన్నవారికి కచ్చితంగా హెచ్చరికలు వెళ్తాయి. అప్పుడు వాళ్లు వెంటనే స్పందించి అదనపు లగేజీనీ అక్కడే వదిలేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ ద్వారా బయటపడే ప్రయత్నం చేయాలి. ఈలోపే మెరైన్‌ బ్లాస్ట్‌ అయింది. అందులో ఉన్న అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరణించిన 73ఏళ్ల పాల్‌ హెన్రీ నాకు స్నేహితుడు. 5 ఏళ్లగా తను నాకు తెలుసు. సముద్ర గర్భంలో పరిశోధనా బృందానికి డైరెక్టర్‌గా పని చేసిన పాల్‌ ఇప్పటి దాకా 37 సార్లు టైటానిక్‌ మునిగిపోయిన ప్రాంతాన్ని సందర్శించారు.

Updated Date - 2023-06-23T16:16:23+05:30 IST