Wow... Waheeda : వహ్‌వా... వహీదా

ABN , First Publish Date - 2023-09-27T02:16:14+05:30 IST

ఆరు దశాబ్దాల తన నట జీవితంలో వివిధ భాషల్లో 90 చిత్రాల్లో నటించారు వహీదా. అద్భుత అందం, అరుదైన అభినయం, చక్కని ప్రవర్తన ఆమెను మంచి నటిగా తీర్చిదిద్దాయి. 1936 ఫిబ్రవరి 3న తమిళనాడుకు చెందిన చంగల్‌పట్‌లో జన్మించారు...

Wow... Waheeda : వహ్‌వా... వహీదా

వహీదా రెహమాన్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే

ఆరు దశాబ్దాల తన నట జీవితంలో వివిధ భాషల్లో 90 చిత్రాల్లో నటించారు వహీదా. అద్భుత అందం, అరుదైన అభినయం, చక్కని ప్రవర్తన ఆమెను మంచి నటిగా తీర్చిదిద్దాయి. 1936 ఫిబ్రవరి 3న తమిళనాడుకు చెందిన చంగల్‌పట్‌లో జన్మించారు. అమె తండ్రి మహ్మద్‌ అబ్దుల్‌ రెహమాన్‌ డిస్ట్రిక్ట్‌ కమిషనర్‌గా దక్షిణాదిలోని పలు పట్టణాల్లో పని చేశారు. చిన్నతనం నుంచి వహీదా డాక్టర్‌ కావాలని కలలు కన్నారు. అయితే ఊపిరి తిత్తుల వ్యాధితో బాధ పడుతూ తరచూ డాక్టర్ల చుట్టూ తిరుగు తుండడంతో అమె చదువు సాగలేదు. ఇంట్లోనే భరత నాట్యం నేర్చుకున్నారు. పరిచయస్తుల ముందు ఆ నాట్యం ప్రదర్శించే వారు. పన్నెండేళ్ల వయసులో తండ్రి రెహమాన్‌ మరణించారు. అటువంటి సమయంలో భరత నాట్యమే ఆమెకు జీవనాధారం అయింది. జానపద బ్రహ్మ విఠలాచార్య వహీదా ప్రతిభను గమనించి, తెలుగు చిత్రం ‘కన్యాదానం’ (1955)లో తొలి అవకాశం ఇచ్చి, రెండు పాటల్ని ఆమెపై చిత్రీకరించారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘రోజులు మారాయి’ చిత్ర దర్శకుడు తాపీ చాణక్యకు వహీదా గురించి తెలిసింది. తమ చిత్రంలో ‘ఏరువాక సాగారో’ పాట కోసం నర్తకిగా ఎన్నిక చేశారు. ఈ పాట చిత్రీకరణ జరుగుతున్నప్పుడు ఇతర నిర్మాతలు, దర్శకులు సెట్‌కు వెళుతుండే వారు. అలా నందమూరి సోదరులు ఎన్టీఆర్‌, త్రివిక్రమరావు దృష్టిలో పడ్డారు వహీదా. వారి ‘జయసింహ’లో రాజకుమారి పాత్రను ఆమెకు ఇచ్చారు. ‘కన్యాదానం’, ‘రోజులు మారాయి’ చిత్రాల్లో నృత్య సన్నివేశాల్లో మాత్రమే పాల్గొన్న వహీదాకు హీరోయిన్‌గా ప్రమోషన్‌ ఇచ్చి, ఆమె భవిష్యత్‌కు మంచి బాట వేశారు ఎన్టీఆర్‌. ‘జయసింహ’లో వహీదాకు షావుకారు జానకి డబ్బింగ్‌ చెప్పడం విశేషం. ఆ సమయంలోనే మోడరన్‌ థియేటర్స్‌ సంస్థ తమిళంలో నిర్మించిన ‘అలీబాబా నలభై దొంగలు’ చిత్రంలో కూడా ఓ నృత్య సన్నివేశంలో పాల్గొన్నారు వహీదా. ఎమ్జీఆర్‌, భానుమతి ఈ చిత్రంలో జంటగా నటించారు. తొలి సినిమా ‘కన్యాదానం’ ఆడకపోయినా, ‘రోజులు మారాయి’, ‘జయసింహ’ చిత్రాలు తెలుగునాట ఘన విజయం సాధించాయి. ముఖ్యంగా ‘ఏరువాక’ పాట ఆంధ్ర దేశాన్ని ఓ ఊపు ఊపేసింది. హైదారాబాద్‌లో శత దినోత్సవం జరుపుకొన్న తొలి చిత్రంగా ‘రోజులు మారాయి’ చరిత్రలో చోటు సంపాదించుకుంది. ఆ సమయంలోనే బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు గురుదత్‌ ఈ సినిమాలోని పాటను, వహీదా ను చూసారు. రాజ్‌ ఖోస్లా దర్శకత్వంలో తను నిర్మించే ‘సిఐడి’ చిత్రంలో ఆమెను సెకండ్‌ హీరోయిన్‌గా ఎంపిక చేశారు. 1956లో విడుదల అయిన ఈ చిత్రం విజయం సాధించి వహీదాకు మంచి పేరు తెచ్చింది. ఆ వెంటనే వచ్చిన ‘ప్యాసా’ (1957)లోనూ ఆమెకు మంచి పాత్ర ఇచ్చారు గురుదత్‌. ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే గురుదత్‌, వహీదా ప్రేమలో పడ్డారు. 1959లో వచ్చిన ‘కాగజ్‌ కే ఫూల్‌’ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు వహీదా. ఆ చిత్ర కథలో హీరోలాగే గురుదత్‌ వహీదా మోజులో పడి, తన భార్యా బిడ్డలకు దూరం అయ్యారు.. ఈ కారణంగా గురుదత్‌కు దూరంగా ఉండాలని వహీదా నిర్ణయించుకున్నారు. అలా నిర్ణయించుకున్న తర్వాత కూడా అయిష్టంగానే మరో రెండు చిత్రాలలో ఆయనతో కలసి నటించక తప్పలేదు ఆమెకి. వహీదా తనకు దూరమైందన్న బాధతో గురుదత్‌ మోతాదుకు మించి నిద్ర మాత్రలు తీసుకొని తనువు చాలించారు. వహీదా జీవితంలో ఇదొక విషాదం.

సత్యజిత్‌ రాయ్‌ సినిమా కోసం..

1962లో సత్యజిత్‌ రాయ్‌ రూపొందించిన ‘అభిజాన్‌’ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఆ సినిమా కోసం కొన్ని హిందీ చిత్రాలను కూడా ఆమె వదులుకున్నారు. అందులో ఆమె పోషించిన గులాబీ పాత్ర ఎంతో పేరు తెచ్చింది. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగులో ‘బంగారు కలలు’ చిత్రంలో నటించారు వహీదా. అక్కినేని, లక్ష్మీ జంటగా నటించిన ఈ చిత్రంలో వహిదాపై చిత్రీకరించిన ‘సింగారం చిందులు వేసే అమ్మాయిల్లారా’ పాట పాపులర్‌ అయింది.

ఆ తర్వాత మళ్లీ 1986 హీరో కృష్ణ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించిన ‘సింహాసనం’ చిత్రంలో రాజమాతగా నటించారు. 2006లో సిద్దార్థ్‌ హీరోగా నటించిన ‘చుక్కల్లో చంద్రుడు’లో అక్కినేని భార్యగా నటించారు వహీదా. హిందీలో ‘లంహే’, ‘చాందినీ2, ‘చాందినీ’, ‘ఢిల్లీ 6’ వంటి చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు గుర్తుండిపోతాయి. 2021లో వచ్చిన స్పోర్ట్స్‌ డ్రామా ‘స్కాటర్‌ గర్ల్‌’ తర్వాత వహీదా మరే చిత్రంలో నటించలేదు.

జీవితంలోనూ పలు మలుపులు

హిందీ చిత్ర పరిశ్రమలో మేటి నాయికగా నిలిచిన వహీదా జీవితంలో కూడా పలు మలుపులు ఉన్నాయని చెప్పాలి. గురుదత్‌, దేవానంద్‌లతో ప్రేమాయణం సాగించిన వహీదా ‘షగున్‌’ చిత్రంలో తనతో నటించిన కమల్‌జిత్‌ సింగ్‌ను 1974 ఏప్రిల్‌ 24న పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళి అయ్యాక ముంబై వదిలి బెంగళూరు చేరుకుని భర్తతో ప్రశాంత జీవితం గడిపారు. వీరికి ఇద్దరు పిల్లలు. 2000 సంవత్సరంలో భర్త మరణించిన తర్వాత మనశ్శాంతి కోసం మళ్ళీ ముంబైకి మకాం మార్చారు. కొన్ని చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం, పద్మభూషణ్‌ అవార్డు పొందిన వహీదా ప్రస్తుతం బెంగళూరులోనే ఉంటున్నారు.

మత్తెక్కించిన అందం

1960ల దశకంలో వహీదా అందం ఆనాటి యువతనే కాకుండా ఆమెతో నటించే హీరోల్ని సైతం మత్తెక్కిచింది. వహీదాతో నటించాలనీ, ఆమెతో పరిచయం పెంచుకోవాలని హీరోలు తహతహ లాడేవారు. వాళ్లలో దేవానంద్‌ ఒకరు. గురుదత్‌ మిత్రుడైన దేవానంద్‌ చిత్రాలు వహీదాకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. వీరిద్దరి మధ్య కొంతకాలం ప్రేమాయణం నడిచింది.

Updated Date - 2023-09-27T02:21:07+05:30 IST