వైష్ణవ్ తేజ్ మాస్ అవతార్
ABN , First Publish Date - 2023-11-21T00:31:10+05:30 IST
పంజా వైష్ణవ్ తేజ్ నటించిన పూర్తి మాస్ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం ‘ఆదికేశవ’. ఇటీవల వచ్చిన ‘మ్యాడ్’ చిత్రంలో నటుడిగా అలరించిన శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో...

పంజా వైష్ణవ్ తేజ్ నటించిన పూర్తి మాస్ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం ‘ఆదికేశవ’. ఇటీవల వచ్చిన ‘మ్యాడ్’ చిత్రంలో నటుడిగా అలరించిన శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా థియేట్రికల్ ట్రైలర్ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. సినిమా మీద ఉన్న అంచనాలను ఈ ట్రైలర్ రెట్టింపు చేసింది. ఈ కార్యక్రమంలో హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ ‘ట్రైలర్కు వస్తున్న స్పందన చూసి చాలా ఆనందగా ఉంది. ఈ సినిమా కోసం మేమెంతో కష్టపడ్డాం. ట్రైలర్లాగే సినిమా కూడా మిమ్మల్ని అలరిస్తుంది’ అన్నారు. ఈ సందర్భంగా ‘నాక్కొంచెం తిక్కుంది..దానికో లెక్కుంది’ అంటూ పవన్కల్యాణ్ చెప్పిన డైలాగ్ చెప్పి అభిమానుల్లో ఉత్సాహం పెంచారు వైష్ణవ్ తేజ్. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘ఇది పక్కా మాస్ సినిమా. ఇందులో యాక్షన్, కామెడీ, ఎమోషన్, సాంగ్స్ అన్నీ బాగుంటాయి. ఈ ఏడాది వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాల తర్వాత వస్తున్న పర్ఫెక్ట్ మాస్ ఫిల్మ్ ఇది’ అన్నారు. రాధిక, అపర్ణాదాస్, మలయాళ నటుడు జోజు జార్జ్ నటించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. సాయి సౌజన్యతో కలసి సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకర్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.