Overwhelmed that he got an Oscar : అందుకే ఆస్కార్ వచ్చిందని పొంగిపోలేదు
ABN , First Publish Date - 2023-04-10T01:13:50+05:30 IST
‘‘నిప్పులు చిమ్ముతూ నింగికెగిరితే నిబిడాశ్చర్యంతో వీరు... నెత్తురుకక్కుతూ నేలరాలితే నిర్ధాక్షిణ్యంగా వీరే’... ఇలాంటి రెండు రకాల పరిస్థితిని నా జీవితంలో ఐదారుసార్లు చవిచూశా. అందుకే ఆస్కార్ పురస్కారం సాధించినా నేను...
‘‘నిప్పులు చిమ్ముతూ నింగికెగిరితే నిబిడాశ్చర్యంతో వీరు... నెత్తురుకక్కుతూ నేలరాలితే నిర్ధాక్షిణ్యంగా వీరే’... ఇలాంటి రెండు రకాల పరిస్థితిని నా జీవితంలో ఐదారుసార్లు చవిచూశా. అందుకే ఆస్కార్ పురస్కారం సాధించినా నేను పెద్దగా పొంగిపోలేదు’’ అని సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటతో ఎన్నో సంవత్సరాల ఆస్కార్ కలను నిజం చేసిన కీరవాణి, చంద్రబో్సను తెలుగు చిత్ర పరిశ్రమ ఘనంగా సన్మానించింది. ఆదివారం హైదరాబాద్లోని శిల్ప కళావేదికలో జరిగిన కార్యక్రమంలో నటీనటులు, నిర్మాతలు, దర్శకులు సహా పరిశ్రమకు చెందిన 24 విభాగాల నిపుణులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ ‘‘నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కిదంటే ఆ క్రెడిట్ రాజమౌళి, ప్రేమ్రక్షిత్లదే. ఈ ఘనతకు మూల విరాట్టులు వారే. నేనూ, చంద్రబోస్ వారి తరపున ఉత్సవ విగ్రహాల్లా పాల్గొన్నాం అంతే. ఎన్టీఆర్, రామ్చరణ్ డాన్స్ చేసేందుకు చాలా సాధన చేశారు. అందరి కృషితోనే ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ పురస్కారం వచ్చింది’ అని అన్నారు.
చంద్రబోస్ మాట్లాడుతూ ‘ఆస్కార్ నా వరకూ ఒక అబద్ధం లాంటి నిజం. ఒక స్వప్నం లాంటి సత్యం. ఒక ఊహలాంటి వాస్తవం. ఒక కల్పన లాంటి యదార్థం. దాన్ని సాధ్యం చేసిన రాజమౌళికి కృతజ్ఞతలు. ‘నాటునాటు’కు ఆస్కార్ ప్రకటించగానే వేదికపైన ఎక్కడానికి పట్టిన 15 సెకండ్ల పాటు నిర్వికల్ప సమాధి స్థితిని అనుభవించాను. భారత సాహిత్య పతాకాన్ని చేతుల్లో పట్టుకున్నంత ఆనందం కలిగింది’ అన్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ‘‘నాటు నాటు’ పాట విశ్వవ్యాప్తమైంది. తొలిసారి ఇంతమంది ఒకే వేదికపైకి రావడం ఆనందంగా ఉంది. కొన్ని కోట్ల మంది కలను కీరవాణి, చంద్రబోస్ నెరవేర్చారు’ అని అభినందించారు. తెలంగాణ మంత్రి శ్రీనివా్సగౌడ్ మాట్లాడుతూ ‘గతంలో తెలంగాణ భాష, యాసను తక్కువ చేశారు. కానీ ఈ రోజు తెలంగాణ పలుకుబడితో రచించిన ‘నాటు నాటు’ గీతానికి ఆస్కార్ దక్కడం ఆనందాన్నిచ్చింద’న్నారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘చంద్రబోస్, కీరవాణి ప్రపంచం తెలుగు నేలవైపు చూసేలా చేశారు. ఆస్కార్ నాకే వచ్చినంత సంతోషం కలిగింది’ అని ప్రశంసించారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ‘రాజమౌళి, కీరవాణి, బుర్రా సాయిమాధవ్, విజయేంద్రప్రసాద్, చంద్రబోస్ పంచపాండవుల్లా కలసి పనిచేసి ఆస్కార్ని సాధించారు’ అని కొనియాడారు. ‘రానా మాట్లాడుతూ ‘ఆస్కార్ కొట్టడం అంటూ జరిగితే అది తొలుత తెలుగు ఇండస్ట్రీనుంచే అని తాతగారు అనేవారు. ఆ మాటను చంద్రబోస్, కీరవాణి నిజం చేశార’న్నారు.