వెబ్‌ సిరీస్‌గా ‘తెలంగాణ త్యాగధనులు’

ABN , First Publish Date - 2023-06-06T01:55:13+05:30 IST

తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన కొంతమంది త్యాగధనుల జీవిత చరిత్రల ఆధారంగా ‘తెలంగాణ త్యాగధనులు’ పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌కు శ్రీకారం చుట్టారు నిర్మాత విజయ్‌కుమార్‌. భారీ బడ్జెట్‌తో...

వెబ్‌ సిరీస్‌గా ‘తెలంగాణ త్యాగధనులు’

తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన కొంతమంది త్యాగధనుల జీవిత చరిత్రల ఆధారంగా ‘తెలంగాణ త్యాగధనులు’ పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌కు శ్రీకారం చుట్టారు నిర్మాత విజయ్‌కుమార్‌. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకొనే ఈ వెబ్‌ సిరీస్‌కు నాగబాల సురేశ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ కుర్మాచలం, దర్శకుడు రేలంగి నరిసింహారావు, నటి రోజారమణి, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రాజ్‌ కందుకూరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రచయిత వెనిగళ్ల రాంబాబు రాసిన ‘వందనం వందనం తెలంగాణ త్యాగధనులకు ఇదే వందనం’ అనే పాటను రోజారమణి విడుదల చేశారు. నిర్మాత విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘వ్యాపార పరంగా ఆలోచిస్తే నేను ఓ కమర్షియల్‌ ఫిల్మ్‌ తీయవచ్చు. కానీ అలాంటి సినిమా ఇలా వచ్చి అలా కనుమరుగు అవుతుంది. చరిత్రలో నిలిచిపోయే సబ్జెక్టులు కొన్నే ఉంటాయి. అలాంటిదే ‘తెలంగాణ త్యాగధనులు’ వెబ్‌ సిరీస్‌. లాభాపేక్ష లేకుండా ఈ సిరిస్‌ను అందిస్తున్నాం’ అని చెప్పారు. దర్శకుడు సురేశ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘తెలంగాణ చరిత్ర తవ్వుకుంటూ పోతే చాలా ఉంది. తెలుగులో తొలి రామాయణ కర్త బమ్మెర పోతన, దక్షిణ భారతదేశంలో తొలి పాలకురాలు రుద్రమదేవి, ప్రధాన మంత్రిగా పని చేసిన పి.వి నరసింహారావు ఇలా ఎందరో త్యాగధనులు ఉన్నారు. ఇది కేవలం ఒక ప్రాంతానికే తెలియాల్సిన చరిత్ర కాదు. జాతీయ స్థాయిలో చర్చించుకొనే విధంగా ఈ వెబ్‌ సిరీస్‌ను తీస్తున్నాం’ అని చెప్పారు.

Updated Date - 2023-06-06T01:55:13+05:30 IST