ట్రైలర్లో చూసింది పదిశాతమే
ABN , Publish Date - Dec 24 , 2023 | 02:51 AM
ప్రముఖ యాంకర్ సుమ తనయుడు రోషన్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘బబుల్గమ్’. మానస చౌదరి కథానాయిక. రవికాంత్ పేరేపు దర్శకుడు...
ప్రముఖ యాంకర్ సుమ తనయుడు రోషన్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘బబుల్గమ్’. మానస చౌదరి కథానాయిక. రవికాంత్ పేరేపు దర్శకుడు. ఈ చిత్రం ఈనెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రవికాంత్ సినిమా విశేషాలను పాత్రికేయులతో పంచుకున్నారు.
‘క్షణం’ చిత్రం తర్వాత ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమా చేశాను. తర్వాత కొత్తవాళ్లతో సినిమా చేయాలని ‘బబుల్గమ్’ కథ రాసుకున్నాను. రోషన్ ఈ కథకు సూటవుతాడనిపించింది. జూలైలో షూటింగ్ మొదలుపెట్టి వేగంగా పూర్తి చేశాం.
ఇది ప్రధానంగా ప్రేమికుల చుట్టూ తిరిగే కథ. కుటుంబ అనుబంధాలకు కథలో ప్రాధాన్యం ఉంది. కాలేజ్ విద్య పూర్తి చేసి వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెట్టిన యువతకు అంతా గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగం చేయాలా, నచ్చిన రంగంలో ఎదిగేందుకు కృషి చేయాలా? అమ్మాయితో ప్రేమలో పడితే ఎలా అనే డైలమాలో ఉంటారు. ఈ తరం యువకులు ఎదుర్కొంటున్న ఇలాంటి అంశాల చుట్టూ కథను ఆసక్తికరంగా అల్లుకున్నాను. సినిమాలో ఇంటర్వెల్, క్లైమాక్స్ హైలెట్గా ఉంటాయి. ప్రేక్షకులను బలంగా హత్తుకుంటాయి.
రోషన్ అద్భుతంగా నటించాడు. ట్రైలర్లో చూసింది పదిశాతమే. సినిమాలో చాలా అద్భుతంగా చేశాడు. ఇతర నటీనటులు కూడా చక్కని నటన కనబరిచారు. శ్రీ చరణ్ సంగీత సారథ్యంలో వచ్చిన గీతాలు ప్రేక్షకులు ఆకట్టుకుంటున్నాయి.
సుమగారు సినిమా విషయంలో నాపై నమ్మకం ఉంచారు. నన్ను, రోషన్ను బలంగా నమ్మారు. మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించాయి.