వరుస చిత్రాలతో జోరు పెంచారు

ABN , First Publish Date - 2023-04-25T00:16:39+05:30 IST

టాలీవుడ్‌ అగ్రహీరోలు దూకుడు మీదున్నారు చకచకా సినిమాలు అంగీకరిస్తూ స్పీడ్‌ పెంచుతున్నారు.

వరుస చిత్రాలతో జోరు పెంచారు

టాలీవుడ్‌ అగ్రహీరోలు దూకుడు మీదున్నారు చకచకా సినిమాలు అంగీకరిస్తూ స్పీడ్‌ పెంచుతున్నారు. ఏకకాలంలో రెండు మూడు సినిమాలతో సెట్స్‌లో సందడి చేస్తున్నారు. ఒకదాని వెంట ఒకటిగా కొత్త సినిమాలు ప్రకటిస్తూ పరిశ్రమలో ఉత్సాహం నింపుతున్నారు.

ప్రస్తుతం నాలుగు చిత్రాలతో బిజీగా ఉన్నారు పవన్‌ కల్యాణ్‌. అవన్నీ కూడా క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్నవే. దర్శకుడు క్రిష్‌ తెరకెక్కిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ‘గబ్బర్‌సింగ్‌’ చిత్రంతో పవన్‌ కల్యాణ్‌కు సంచలన విజయాన్ని అందించారు హరీశ్‌ శంకర్‌. ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ చిత్రంతో ఆయన మరోసారి పవన్‌ కల్యాణ్‌ను డైరెక్ట్‌ చే సేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలె ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. శ్రీలీల కథానాయిక.

తమిళ హిట్‌ చిత్రం ‘వినోదాయ సీతమ్‌’ రీమేక్‌లోనూ పవన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రంలో మరో కీలకపాత్రను ఆయన మేనల్లుడు సాయితేజ్‌ చేస్తున్నారు. మాతృకకు దర్శకత్వం వహించిన సముద్రఖని ఈ రీమేక్‌ను రూపొందిస్తున్నారు. త్రివిక్రమ్‌ రచనా సహకారం అందిస్తున్నారు. పవన్‌కు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేసినట్లు సమాచారం.

పవన్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మరో చిత్రం ‘ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌’ (ఓజీ). ‘సాహో’ తర్వాత సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇదొక గ్యాంగ్‌స్టర్‌ డ్రామా. పవన్‌ శక్తిమంతమైన పాత్రలో కనిపించబోతున్నారు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. తొలిషెడ్యూల్‌ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

ఐదు చిత్రాలతో అదరగొడుతున్నారు

పాన్‌ ఇండియా స్థాయిలో జోరు కొనసాగిస్తున్నారు ప్రభాస్‌. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదిపురుష్‌’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం మరో నాలుగు సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో ‘సలార్‌’ చిత్రం చేస్తున్నారు. చిత్రీకరణ చివరిదశలో ఉంది. ప్రభా్‌సకు జోడీగా శ్రుతీహాసన్‌ నటిస్తున్నారు. దర్శకుడు మారుతితో ఓ చిత్రం చేస్తున్నారు. ఓ విభిన్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోందని సమాచారం. సందీ్‌పరెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న ‘స్పిరిట్‌’ ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో ప్రభాస్‌ పోలీస్‌ పాత్రలో నటిస్తున్నారు. అలాగే నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్‌ కె’ చేస్తున్నారు. దీపికా పదుకొణే కథానాయిక. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాలీవుడ్‌లో యాక్షన్‌చిత్రాల దర్శకుడిగా పేరుపొందిన సిద్ధార్థ్‌ ఆనంద్‌తో ప్రభాస్‌ ఓ చిత్రం చేయబోతున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ స్పష్టత ఇచ్చింది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత ్వంలో ప్రభాస్‌ సినిమా ఉంటుందని తెలిపింది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని చెప్పింది.

ఎన్టీఆర్‌ జోరు

ఎన్టీఆర్‌ మరోసారి హిట్‌ కాంబినేషన్‌తో అభిమానుల ముందుకొస్తున్నారు. ‘జనతా గ్యారేజీ’ తర్వాత ఆయన కొరటాల శివతో ఓ చిత్రం చేస్తున్నారు. ‘ఎన్టీఆర్‌ 30’ వర్కింగ్‌ టైటిల్‌. జాన్వీకపూర్‌ కథానాయిక. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అలాగే ఆయన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ చిత్రం కమిటయ్యారు. ‘ఎన్టీఆర్‌ 31’ వర్కింగ్‌ టైటిల్‌. ‘సలార్‌’ పూర్తయ్యాక ప్రశాంత్‌ ఈ చిత్రాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఆయన ఎలాంటి కథతో ఈ చిత్రం తెరకెక్కించబోతున్నారు, అందులో ఎన్టీఆర్‌ పాత్ర ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ‘వార్‌’ సీక్వెల్‌లో ఎన్టీఆర్‌ నటిస్తున్నారంటూ ఇటీవలె బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ‘వార్‌ 2’లో హృతిక్‌రోషన్‌తో ఎన్టీఆర్‌ స్ర్కీన్‌షేర్‌ చేసుకోబోతున్నారని చెబుతున్నారు. అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశముందంటున్నారు.

భారీ లైన్‌పతో చరణ్‌

దర్శకుడు బుచ్చిబాబుతో తన 16వ చిత్రం ప్రకటించారు రామ్‌చరణ్‌. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. క్రీడా నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం తెరకెక్కుతోందని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. బుచ్చిబాబుకు దర్శకుడిగా ఇది రెండో చిత్రం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించాల్సి ఉంది. చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ చేంజర్‌’ చేస్తున్నారు. ఇందులో ఆయన రెండు పాత్రలు పోషిస్తున్నారు. కియారా అద్వాణీ కథానాయిక. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌ నేపథ్యంలో అంతర్జాతీయ మీడియాతో చరణ్‌ మాట్లాడుతూ తాను ప్రస్తుతం ఆరు చిత్రాలు అంగీకరించినట్లు చెప్పారు. ఈ ఏడాది మూడు చిత్రాలు, వచ్చే ఏడాది మూడు చిత్రాలు సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దర్శకులు సుకుమార్‌, ప్రశాంత్‌నీల్‌, లోకేష్‌ కనగరాజ్‌, నర్తన్‌తో చరణ్‌ తన తదుపరి చిత్రాలు చేయబోతున్నట్లు సమాచారం.

రెండేసి చిత్రాలతో

మరికొందరు యువ హీరోలు కూడా రెండు మూడు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’, ‘రావణాసుర’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు రవితేజ. ప్రస్తుతం ‘టైగర్‌ నాగేశ్వరరావు’, ‘ఈగిల్‌’ చిత్రాలు చేస్తున్నారు. నితిన్‌ మరోసారి హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ చేస్తున్నారు. ‘భీష్మ’ దర్శకుడు వెంకీ కుడుములతో చేసే సినిమా ఇటీవలె ప్రారంభమైంది. రష్మిక మందన్న కథానాయిక. అలాగే వక్కంతం వంశీ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్‌ డ్రామా నేపథ్యంలో నితిన్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ ఏడాది ఆరంభంలో ‘అమిగోస్‌’ చిత్రంతో వచ్చారు కల్యాణ్‌రామ్‌. ప్రస్తుతం ఆయన ‘డెవిల్‌’ అనే పీరియాడిక్‌ చిత్రం చేస్తున్నారు. నవీన్‌ మేడారం దర్శకుడు. అలాగే సినిమాటోగ్రాఫర్‌ కె.వి గుహన్‌ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ప్రకటించారు.

Updated Date - 2023-04-25T00:16:44+05:30 IST