ఈతరానికి చెప్పాల్సిన కథ ‘కృష్ణారామ’
ABN , First Publish Date - 2023-10-15T04:05:20+05:30 IST
రాజేంద్ర ప్రసాద్, గౌతమి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘కృష్ణారామ’. వెంకట కిరణ్, కుమార్ కళ్లకూరి, హేమ మాధురి నిర్మించారు. రాజ్ మాదిరాజు దర్శకుడు. ఓటీటీ వేదిక ఈటీవీ విన్ ద్వారా ఈనెల 27 నుంచి...

రాజేంద్ర ప్రసాద్, గౌతమి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘కృష్ణారామ’. వెంకట కిరణ్, కుమార్ కళ్లకూరి, హేమ మాధురి నిర్మించారు. రాజ్ మాదిరాజు దర్శకుడు. ఓటీటీ వేదిక ఈటీవీ విన్ ద్వారా ఈనెల 27 నుంచి స్ర్టీమింగ్ కానుంది. ఇటీవల హైదరాబాద్లో టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ‘‘అన్ని తరాల దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులతో పని చేయడం నా అదృష్టం. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా నన్ను నేను మలచుకొంటున్నా. ‘కృష్ణారామా’ ప్రత్యేక చిత్రం. ఈతరానికి చెప్పాల్సిన కథ ఇది. ఓటీటీలో సినిమా అనగానే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం బోర్ కొట్టినా ఛానల్ మార్చేస్తారు. అందుకే అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా చూశాక ప్రేక్షకులు కూడా కథలో భాగం అవుతారు. అంత చక్కటి కథ ఇద’’న్నారు. ‘‘నా మొదటి హీరో రాజేంద్ర ప్రసాద్ గారితో మళ్లీ పనిచేయడం ఆనందంగా ఉంది. ‘కృష్ణా రామా’ మోడ్రన్ సినిమా. ఇలాంటి కథ రాసి, అందులో నన్ను భాగస్వామిని చేసిన దర్శకుడికి కృతజ్ఞతలు’’ అని గౌతమి తెలిపారు. ‘‘మనసు పెట్టి రాసిన కథ ఇది. రాజేంద్ర ప్రసాద్, గౌతమిలాంటి ఇద్దరు ప్రతిభావంతులు నా ప్రాజెక్ట్లోకి వచ్చాక ఇక వెనక్కి తిరిగి చూసుకొనే అవకాశం రాలేద’’న్నారు దర్శకుడు రాజ్ మాదిరాజ్.