నేను ఎప్పటికీ తెలుగు బిడ్డనే!
ABN , First Publish Date - 2023-06-06T02:06:55+05:30 IST
‘‘తెలుగు కవిత్వం, సాహిత్వం చదివి నా మనసు లోపలకి తెలుగు భాష వెళ్లిపోయింది. చెప్పినా చెప్పకపోయినా నేను తెలుగు బిడ్డనే’’ అన్నారు సిద్దార్థ్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘టక్కర్’....

‘‘తెలుగు కవిత్వం, సాహిత్వం చదివి నా మనసు లోపలకి తెలుగు భాష వెళ్లిపోయింది. చెప్పినా చెప్పకపోయినా నేను తెలుగు బిడ్డనే’’ అన్నారు సిద్దార్థ్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘టక్కర్’. దివ్యాంశ కౌశిక్ కథానాయిక. జి.క్రిష్ దర్శకుడు. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాత. ఈనెల 9న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సిద్దార్థ్ మాట్లాడుతూ ‘‘లవర్ బోయ్ని మాస్గా చూపిస్తే ఎలా ఉంటుందో ‘టక్కర్’ చూస్తే అర్థమవుతుంది. నన్ను ఓ పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాలో చూడాలని చాలామంది ఆశ పడుతున్నారు. వాళ్లందరికీ ‘టక్కర్’ నచ్చుతుంద’’న్నారు. ‘‘సిద్దార్థ్ అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉన్నారు. ఆయన ఈ జనరేషన్లో కమల్హాసన్లా అనిపిస్తార’’న్నారు తరుణ్ భాస్కర్. ‘‘మా గురువుగారు శంకర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ నమ్మకంతోనే ఆయన శిష్యుడిగా ఈ సినిమా చేశాన’’న్నారు కార్తీక్ జి.క్రిష్. నిర్మాత మాట్లాడుతూ ‘‘అమెరికాలో ఉంటున్నప్పుడు ఎక్కువగా డీవీడీల్లోనే సినిమాలు చూసేవాడ్ని. థియేటర్కి వెళ్లి చూసిన మొదటి సినిమా ‘బొమ్మరిల్లు’. అప్పటి నుంచీ అదే అలవాటైపోయింది. ఇప్పుడు ఆ సిద్దార్థ్తోనే సినిమా చేయడం సంతోషంగా ఉంద’’న్నారు.