కొత్త అనుభూతిని ఇస్తుంది

ABN , First Publish Date - 2023-09-07T02:22:01+05:30 IST

నవీన్‌ పొలిశెట్టి, అనుష్క జంటగా నటించిన చిత్రం ‘మిస్‌శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ నిర్మించింది. ఈ గురువారం విడుదలవుతున్న సందర్భంగా మహేశ్‌బాబు సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

కొత్త అనుభూతిని ఇస్తుంది

నవీన్‌ పొలిశెట్టి, అనుష్క జంటగా నటించిన చిత్రం ‘మిస్‌శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ నిర్మించింది. ఈ గురువారం విడుదలవుతున్న సందర్భంగా మహేశ్‌బాబు సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనుకున్న ఒక అమ్మాయు కథ ఇది. ఓ దశలో పెళ్లి కాకుండా తల్లి అవ్వడంలో ఉన్న సంతోషాన్ని కోరుకుంటుంది. దానికోసం ఓ అబ్బాయి సాయం తీసుకుంటుంది. ఈ క్రమంలో ఆ జంటకు ఎదురైన పరిణామాలు ఏమిటి? వాళ్ల జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అనేది సినిమా కథ. ఫన్‌, ఎమోషన్‌ను కలిపి ఒక కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తుంది. కథలో అంతర్లీనంగా సందేశం ఉంటుంది. ఒక్క సన్నివేశం కూడా కుటుంబ ప్రేక్షకులు ఇబ్బందిపడేలా ఉండదు.

మా సొంతూరు భీమవరం. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. కాలేజ్‌ రోజుల నుంచే కథలు రాయడం మొదలైంది. అలా ఇండస్ట్రీకి వచ్చాను. ‘రారా కృష్ణయ్య’ నా తొలి చిత్రం. ఆ తర్వాత నేను రాసుకున్న కథను అనుష్కకు వినిపించాను. ఆ సమయంలో యూవీ క్రియేషన్స్‌ ప్రొడ్యూసర్స్‌ కూడా అక్కడే ఉన్నారు. ఆమెకు కూడా కథ బాగా నచ్చింది. ఇలాంటి మంచి ఎంటర్టైన్‌మెంట్‌ ఉన్న కథ కోసం ఎదురుచూస్తున్నారట. అలా ఆమె ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. నాకన్నా ఎక్కువగా ఆమె ఈ సినిమాపై శ్రద్ధ చూపారు.

తర్వాత నవీన్‌కు కథ చెప్పాను. కొన్ని మార్పుల తర్వాత ఓకే చేశారు. కరోనా లాక్‌డౌన్‌తో సినిమా చిత్రీకరణ ఆలస్యం అయింది. చిరంజీవి గారికోసం ప్రత్యేకంగా షో వేశాం. ఆయన నన్ను, నవీన్‌ను ఇంటికి పిలిచి అభినందించారు. ఆయన ప్రశంసతోనే పెద్ద సక్సెస్‌ సాధించామనిపించింది.

Updated Date - 2023-09-07T02:22:05+05:30 IST