పాటపై వివాదం.. యూనిట్ క్షమాపణ
ABN , First Publish Date - 2023-11-15T00:48:44+05:30 IST
ఇండో-పాకిస్తాన్ మధ్య 1971లో జరిగిన యుద్ధంలో తన తోబుట్టువులతో కలసి భారతదేశం తరపున పోరాడిన కెప్టెన్ బలరామ్ సింగ్ మెహతా జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘పిప్పా’ చిత్రం ఈ నెల పదిన నేరుగా...

ఇండో-పాకిస్తాన్ మధ్య 1971లో జరిగిన యుద్ధంలో తన తోబుట్టువులతో కలసి భారతదేశం తరపున పోరాడిన కెప్టెన్ బలరామ్ సింగ్ మెహతా జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘పిప్పా’ చిత్రం ఈ నెల పదిన నేరుగా ఓటీటీ వేదిక అమెజాన్లో విడుదలైంది. ఇషాన్ ఖట్టర్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాజా కృష్ణ మీనన్ దర్శకత్వం వహించారు. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాలో బెంగాలీ ప్రముఖ కవి కాజీ నజ్రుల్ ఇస్లామ్ రాసిన ‘కరర్ ఓయి లౌహో కోపట్’ పాటను ఉపయోగించారు. సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ పాట ప్రతిష్టను దెబ్బతీసెలా మార్పులు చేసి సినిమాలో ఉపయోగించారని నజ్రుల కుటుంబ సభ్యులు ఆరోపించడంతో వివాదం మొదలైంది. భావాన్ని వక్రీకరించారంటూ మరో పక్క పాట అభిమానులు, నెటిజన్లు మండిపడుతున్నారు. సినిమా నుంచి ఈ పాటను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ రాయ్ కపూర్ ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చింది.
‘దివంగత కాజీ నజ్రుల్ ఇస్లామ్పై మాకు ఎంతో గౌరవం ఉంది. ఈ పాటకు సంబందించిన లైసెన్స్ అగ్రిమెంట్పై కల్యాణి కాజీ సంతకం చేశారు. అనిర్బన్ కాజీ సాక్షిగా ఉన్నారు. పాటలో తగిన మార్పులు చేసుకోవచ్చనే అంశాన్ని ఆ ఒప్పందంలో పేర్కొన్నాం. ఎవరినీ కించపర్చాలన్నది మా ఉద్దేశం కాదు. ఒకవేళ ఈ పాట విషయంలో ఎవరి మనోభావాలైన దెబ్బ తింటే క్షమించండి’ అని పేర్కొంది చిత్ర నిర్మాణ సంస్థ.