సినిమానే ఆయన శ్వాస.. జీవితం
ABN , First Publish Date - 2023-06-13T04:05:03+05:30 IST
తెలుగు సినిమా స్వర్ణయుగానికి మెరుగులు దిద్దిన దర్శకుల్లో ఒకరైన వీరమాచినేని మధుసూదనరావు శత జయంతి వేడుకలను ఆయన శిష్యులు, అభిమానులు ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు...
తెలుగు సినిమా స్వర్ణయుగానికి మెరుగులు దిద్దిన దర్శకుల్లో ఒకరైన వీరమాచినేని మధుసూదనరావు శత జయంతి వేడుకలను ఆయన శిష్యులు, అభిమానులు ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధుసూదనరావు కుమార్తె వాణి మాట్లాడుతూ ‘మధుసూదనరావుగారి అమ్మాయి అనే గొప్ప గుర్తింపు ఇచ్చిన నాన్నగారి రుణం ఎలా తీర్చుకోగలను! ఆయన సినిమానే శ్వాసించారు. జీవితంగా భావించి పయనించారు. జయాపజయాలను ఒకే రీతిని తీసుకునే స్పోర్టివ్నెస్ వల్ల గర్వం ఆయన దగ్గరకు రాలేకపోయింది. ఇంతమంది పెద్దలు ఇప్పటికీ గుర్తు పెట్టుకుని స్మరించుకుంటున్నారంటే ఆయన గొప్పతనం ఏమిటో అర్థమవుతుంది’ అన్నారు. సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి మాట్లాడుతూ ‘నేను ఈ రోజు మూడు పూటలా అన్నం తింటున్నాను అంటే అది మధుసూదనరావుగారి దయే. నా చేతి రాత చూసి తల రాత మార్చేశారాయన. మొదట్లో ఆయన ఆగ్రహానికి గురైనా తర్వాత ఆయన ప్రేమను పొందగలిగాను. అటువంటి మహానుభావుడి శత జయంతి వేడుకలు నిర్వహించుకోవడం ద్వారా భావితరాలకు ఆయన గొప్పతనాన్ని చాటి చెబుతున్నందుకు ఆనందంగా ఉంది’ అన్నారు. ‘హైదరాబాద్కు షిఫ్ట్ అయిన అగ్ర దర్శకుల్లో మధుసూదనరావు మొదటి వారు. ఆయన దర్శకత్వంలో నటించడం నిజంగా నా అదృష్టం. లోకల్ టాలెంట్ను ప్రోత్సహించడానికి మధు ఫిల్మ్ ఇన్స్టిట్టూఇ్ను నెలకొల్పి ఎందరో కళాకారులను పరిశ్రమకు అందించారు’ అన్నారు మురళీమోహన్. ‘కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన మధుసూదనరావు ఎన్నో కుటుంబ కథాచిత్రాలకు దర్శకత్వం వహించి సూపర్ హిట్స్ ఇచ్చినందుకు గర్వించాలి’ అన్నారు రచయిత విజయేంద్రప్రసాద్. మధుసూదనరావు స్ఫూర్తితోనే బంధాలు, అనుబంధాలకు విలువ ఇచ్చే ‘మావిచిగురు’, ‘శుభలగ్నం’ వంటి చిత్రాలు తీయగలిగాననీ ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పారు. ప్రజలను చైతన్యవంతుల్ని చేయడానికి సినిమా మాధ్యమాన్ని మాగ్జిమమ్ ఉపయోగించుకున్న దర్శకుల్లో మధుసూదనరావు ముందు వరసలో ఉంటారని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు. ఆయన స్థాపించిన ఇన్స్టిట్యూట్ తొలి విద్యార్థులలో తను ఒకడు కావడం పూర్వ జన్మ సుకృతం అని శివాజీరాజా చెప్పారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులను మధుసూదనరావు కుటుంబ సభ్యులు సత్కరించారు.