Chandrababu will return like a washed pearl : కడిగిన ముత్యంలా చంద్రబాబు తిరిగి వస్తారు
ABN , First Publish Date - 2023-10-26T01:58:16+05:30 IST
‘అభివృద్ధికి పర్యాయపదం చంద్రబాబు గారు. విజన్ రూపకల్పనలో ఆయనకు ఆయనే సాటి. ముందుచూపుతో ఆయన చేసిన అభివృద్ధి ఫలాలను రెండు రాష్ట్రాల ప్రజలు ఆస్వాదిస్తున్నారు. బహుశా ఏ ముఖ్యమంత్రి చంద్రబాబులా...
‘అభివృద్ధికి పర్యాయపదం చంద్రబాబు గారు. విజన్ రూపకల్పనలో ఆయనకు ఆయనే సాటి. ముందుచూపుతో ఆయన చేసిన అభివృద్ధి ఫలాలను రెండు రాష్ట్రాల ప్రజలు ఆస్వాదిస్తున్నారు. బహుశా ఏ ముఖ్యమంత్రి చంద్రబాబులా నిరంతరం పరితపించి ఉండరు ఒక్క ఐటీ రంగమే కాదు వ్యవసాయ రంగ అభివృద్ధి మొదలుకుని పరిశ్రమల వరకూ ప్రతీ రంగం అభివృద్ధికి విశేష కృషి సల్పిన నాయకుడిగా ఆయన పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. పట్టిసీమతో నదుల అనుసంధానాన్ని సైతం ఆయన చేసి చూపించారు. ఆయన ఇంకో ఆరు నెలలు ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే, ఏపీకి జీవనాడి అయిన పోలవరం కూడా పూర్తయి ఉండేది. అలాంటి అద్భుత విజనరీ నాయకుడిపై రాజకీయ కక్షతో కుట్ర కేసులు పెట్టి, జైలులో పెట్టడాన్ని ప్రతీ ఒక్కరూ ఖండిస్తున్నారు’ అన్నారు సీనియర్ నటుడు మురళీమోహన్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తూ, ఆయనకు సంఘీభావం ప్రకటిస్తూ చిత్రప్రముఖులు బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిర్మాత నట్టి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మురళీమోహన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్య, చంద్రులకు కూడా గ్రహణం పడుతుంది. అది కొద్ది సమయమే ఉంటుంది. చంద్రబాబుకు కూడా ఆ గ్రహణం విడిపోయి, కడిగిన ముత్యంలా ఆయన ప్రజా జీవితంలోకి తిరిగొస్తారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ, ఎప్పుడూ బయటకు రాని కుటుంబ సభ్యులు భువనేశ్వరి, బ్రహ్మణి గార్లు కూడా బయటకు వచ్చి, ఈ అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. వాళ్లు ప్రజల్లోకి వెళితే బావుంటుందని రాజమండ్రిలో వారికి నేను సూచించాను’ అన్నారు.
ఈ సందర్భంగా నట్టి కుమార్ మాట్లాడుతూ‘ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు జైలులో ఉన్నారంటే ప్రజలకే కష్టాలు వచ్చినట్లుగా బావించాలి. ఆయన ప్రజల మనిషి ప్రజలలోనే ఉండాలి. రాజకీయాలలో అభివృద్ధిపరంగా పోటీపడాలి తప్ప ఇలా కక్షలతో జైలులో పెట్టడం ఎంతమాత్రం తగదు. ఆయనను అరెస్ట్ చేసి, ఎలా కేసులు పెట్టాలో అర్ధంకాక వెతుక్కుంటున్నారంటే ఇంతకంటే కక్షకు తార్కాణం ఏముంటుంది. దీనిని అంతా ప్రజలు గమనిస్తున్నారు, సినీ పరిశ్రమ ఎప్పుడూ ఆయన వెంటే ఉంది. ఈ కష్ట కాలంలో కూడా ఆయనకు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. కాకపోతే ఇప్పటివరకూ ఎవరికి వారు సొంతంగానే తమ మద్దతు తెలిపారు. అయితే సినీ పరిశ్రమలోని వారు ఒక వేదికగా సంఘీభావాన్ని తెలియజేస్తే బావుంటుందన్న సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను. అశ్వనీదత్ గారు, కె.రాఘవేంద్రరావు గారు తదితరులు లోకేశ్ గారి మీటింగ్ కు వెళ్లారు. ఇంకొంతమంది అందుబాటులో లేక ఫోన్లు చేసి, మరీ తమ సంఘీభావాన్ని ప్రకటించారు’ అన్నారు.
టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘ నిరంతరం అభివృద్ధి కోసం పరితపించిన చంద్రబాబు గారి లాంటి ముఖ్యమంత్రి భారతదేశంలోనే మరొకరు లేరు..రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశ, విదేశాలలోని వారు కూడా ఆయనకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈ నెల 29 న సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు చంద్రబాబు గారికి సంఘీభావం ప్రకటిసూ ్తహైదరాబాద్, గచ్చిబౌలి స్టేడియంలో ఐటీ ప్రొఫెషనల్స్, సినిమా వాళ్లు, ఇంకా వివిధ రంగాల ప్రొఫెషనల్స్ పాల్గొనేలా ఓ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహిస్తున్నారు. దీనిని కూడా విజయవంతం చేయాలి’ అన్నారు.
కె.ఎల్.దామోదర ప్రసాద్ మాట్లాడుతూ, ఎన్ఠీఆర్ గారితో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉండేదని, అలాగే చంద్రబాబుతో కూడా మంచి పరిచయం ఉందని, ఆయన లాంటి విజన్ గల నాయకుడు వేరొకరు ఉండరని అన్నారు.
తుమ్మల రామసత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు గారి అరెస్ట్ తర్వాత ఆయనపై ఎలాంటి కేసులు పెట్టాలో అర్ధంకాక వెతుక్కోవడం శోచనీయమని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకులు రామ్ప్రసాద్, రవికుమార్ చౌదరి, వి.సముద్ర, చంద్రమహేశ్, శివనాగు, నిర్మాతలు ఆచంట గోపినాధ్, ఆర్.కె.భగవాన్,, పల్లె కేశవరావు, ఎస్.వి.రావు, సినిమాటోగ్రాఫర్ జవహర్ రెడ్డి, రచయిత డైమండ్ రత్నబాబు, చిత్రపురి కాలనీ, ఫెడరేషన్ చైర్మన్ వల్లభనేని అనిల్, ఇంకా పలువురు పాల్గొన్నారు.