Padmaja: గుండెపోటుతో నటుడు హరనాథ్ కుమార్తె మృతి
ABN, First Publish Date - 2022-12-20T17:14:07+05:30
ప్రముఖ నిర్మాత జి.వి.జి.రాజు (GVG Raju) భార్య పద్మజా రాజు (Padmaja Raju) మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమె వయసు
ప్రముఖ నిర్మాత జి.వి.జి.రాజు (GVG Raju) భార్య పద్మజా రాజు (Padmaja Raju) మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమె వయసు 54 సంవత్సరాలు. ఇద్దరు కుమారులు ఉన్నారు. నాటి తరం అందాల హీరో హరనాథ్ (Haranath)కు పద్మజా రాజు కుమార్తె. ఆమె అన్న శ్రీనివాసరాజు (Srinivasa Raju) కూడా నిర్మాతనే.
పద్మజారాజు భర్త జి.వి.జి.రాజు.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా ‘గోకులంలో సీత, తొలిప్రేమ’ వంటి చిత్రాలు నిర్మించారు. ఆయన శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో ‘గోదావరి’ చిత్రం కూడా తెరకెక్కించారు. ఇటీవల పద్మజారాజు తన తండ్రి హరనాథ్ గురించి ‘అందాలనటుడు’ (Andhala Natudu) పేరుతో ఓ పుస్తకం వెలుగులోకి తెచ్చారు. ఆ పుస్తకాన్ని నటశేఖర కృష్ణ (Krishna) చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పద్మజా రాజు మాట్లాడుతూ.. త్వరలోనే తన కుమారుల్లో ఒకరు నిర్మాతగా పరిచయం కానున్నారని తెలిపారు. వచ్చే యేడాది తన తనయుణ్ణి నిర్మాతగా పరిచయం చేసే ప్రయత్నాల్లో పద్మజ, ఆమె భర్త జి.వి.జి.రాజు ఉండగా.. ఇప్పుడు సడెన్గా ఆమె హఠాన్మరణం చెందడం విచారకరం. ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని.. జీవీజీ రాజు, ఆయన కుమారులకు మనో ధైర్యం లభించాలని ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.