Connect: అందుకే ఇంటర్వెల్ పెట్టలేదంటున్న దర్శకుడు

ABN , First Publish Date - 2022-12-17T20:36:19+05:30 IST

నయనతార (Nayanthara) ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘కనెక్ట్’ (Connect). ఈ సినిమాను ఈ నెల 22న యూవీ క్రియేషన్స్ (UV Creations) తెలుగులో గ్రాండ్‌గా విడుదల..

Connect: అందుకే ఇంటర్వెల్ పెట్టలేదంటున్న దర్శకుడు
Director Ashwin Saravanan

నయనతార (Nayanthara) ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘కనెక్ట్’ (Connect). ఈ సినిమాను ఈ నెల 22న యూవీ క్రియేషన్స్ (UV Creations) తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ (Ashwin Saravanan) ఈ చిత్రాన్ని రూపొందించారు. హారర్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో పేరున్న ఈ దర్శకుడు గతంలో నయనతార నాయికగా ‘మయూరి’ (Mayuri), తాప్సీ హీరోయిన్‌గా ‘గేమ్ ఓవర్’ (Game Over) చిత్రాలను తెరకెక్కించి ఘన విజయం అందుకున్నారు. ‘కనెక్ట్’ విడుదల సందర్భంగా దర్శకుడు అశ్విన్ శరవణన్ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

ఆయన మాట్లాడుతూ..

‘‘ఇది హార్రర్ థ్రిల్లర్ చిత్రం. లాక్‌డౌన్‌లో కుటుంబాలు కలిసి లేవు. ఏదో పని మీద మరో ప్రాంతానికి వెళ్లిన వాళ్లు అక్కడే స్ట్రక్ అయ్యారు. అలా ఒక కుటుంబంలోని తల్లీ కూతురు ఇంట్లో ఉండిపోతారు. కొద్ది రోజులకు కూతురి ప్రవర్తనలో అనూహ్య మార్పులు వస్తాయి. ప్రేతాత్మ ఆవహించినట్లు ఆమె బిహేవ్ చేస్తుంటుంది. అలాంటి పరిస్థితుల్లో బిడ్డను తల్లి ఎలా కాపాడుకుంది అనేది ఈ సినిమా కథ. ఆ పాపను ఆవహించిన ఆత్మను పోగొట్టేందుకు తల్లి ఫాదర్ అగస్టీన్ హెల్ప్ కోరుతుంది. ఈ క్యారెక్టర్‌లో అనుపమ్ ఖేర్ నటించారు. ఇలాంటి క్యారెక్టర్స్ ప్రేక్షకులు నమ్మేలా ఉండాలి. ఆ సహజత్వాన్ని అనుపమ్ ఖేర్ (Anupam Kher) తన నటనతో చూపించారు.

హాలీవుడ్ చిత్రాల్లో సినిమాకు ఇంటర్వెల్ ఉండదు. కథలోని ఫీల్ పోతుందని వారు విరామాలు పెట్టరు. ఒక ఫ్లోలో వెళ్తున్న కథకు విరామం ఇస్తే ప్రేక్షకులు డైవర్ట్ అవుతారు. ఈ చిత్రంలోనూ ఇంటర్వెల్ ఉండదు. హార్రర్ థ్రిల్ పంచుతూ ఏక బిగిన కథ సాగుతుంటుంది. సినిమా నిడివి గంటన్నర ఉంటుంది. కాబట్టి చూడటం సులువు. ఇటీవల హిట్ అయిన చాలా సినిమాల నిడివి మూడు గంటలు ఉంది. వాటికి ఇంటర్వెల్ గంటన్నరకు ఇచ్చారు. కాబట్టి మా సినిమాను కంటిన్యూగా చూడటంలో ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బందులు పడరని అనుకుంటున్నా. ప్రేక్షకులు ఆదరిస్తే ఇలాంటి పద్ధతిలో మరిన్ని సినిమాలు రూపొందుతాయి. అప్పుడు థియేటర్లో ఆరేడు షోస్ ప్రదర్శించే వీలు కూడా కలుగుతుంది.

నయనతారతో గతంలో ‘మాయా’ (తెలుగులో మయూరి) అనే చిత్రాన్ని రూపొందించాను. ఆమె పట్ల నాకు గౌరవం ఉంది. దర్శకుడిగా నేనంటే ఆమెకు నమ్మకం. అందుకే మళ్లీ ఈ సినిమాను నయనతారతోనే చేశాను. ఈ కథ విన్నాక ఆమెకు బాగా నచ్చింది. దీన్ని ఒక అంతర్జాతీయ స్థాయి చిత్రంగా నిర్మించాలన్నది నయనతార కోరిక. అందుకే విఘ్నేష్‌తో కలిసి ఆమె ప్రొడ్యూస్ చేసింది. మాకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ సమకూర్చింది. నటిగా నయనతారను అడ్మైర్ చేస్తాను. ఈ సినిమాలో ప్రతి సీన్ ఆమె నటన ఆకట్టుకుంటుంది. ఆద్యంతం తన పర్మార్మెన్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఒక డిఫరెంట్ కథను చూపిస్తున్నప్పుడు నటీనటుల ఎంత ప్రామిసింగ్‌గా కనిపిస్తే అంత సినిమాకు అడ్వాంటేజ్. ఆ విషయంలో నయనతార టాప్ యాక్ట్రెస్.

ప్రేక్షకులను చూపు తిప్పుకోకుండా చేసే ఇలాంటి తరహా చిత్రాలను తెరకెక్కించడానికి ఇష్టపడతాను. ఇలాంటి చిత్రాలకు మన దగ్గర మంచి డిమాండ్ ఉంటుంది. తెలుగులో ‘మసూద’ (Masooda) మంచి విజయాన్ని సాధించింది. తెలుగు, తమిళ పరిశ్రమలు ప్రస్తుతం కలిసి పనిచేస్తున్నాయి. ఇదొక ఆరోగ్యకరమైన వాతావరణం. టాలీవుడ్‌ (Tollywood)లో నాకు నాని (Nani)గారి సినిమాలంటే ఇష్టం. ఆయనకు గతంలో ‘మయూరి’ కథ చెప్పాను. తనే సినిమా ప్రొడ్యూస్ చేస్తానన్నాడు. ఆయనతో ఒక సినిమా రూపొందించాలని ఉంది’’ అని తెలిపారు.

Updated Date - 2022-12-17T20:47:00+05:30 IST