కమల్ పక్కన నటించడమే పెద్ద గిఫ్ట్ : Vijay Sethupathi
ABN , First Publish Date - 2022-06-19T19:01:20+05:30 IST
ఇటీవల విడుదలైన కమల్హాసన్ (Kamal Haasan) ‘విక్రమ్’ (Vikram) చిత్రంలో అద్భుతమైన రీతిలో విలనిజాన్ని పండించాడు మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi). అందులో కమల్ తో పాటు అతడు కూడా సమానమైన క్రేజ్ తెచ్చుకున్నాడు.
ఇటీవల విడుదలైన కమల్హాసన్ (Kamal Haasan) ‘విక్రమ్’ (Vikram) చిత్రంలో అద్భుతమైన రీతిలో విలనిజాన్ని పండించాడు మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi). అందులో కమల్ తో పాటు అతడు కూడా సమానమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో అతడు హీరోగా నటిస్తు్న్న తాజా చిత్రానికి మరింతగా హైపు క్రియేట్ అయింది. సినిమా పేరు ‘మామనిదన్’ (Maamanithan) (మహామనిషి). ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. ఆ కార్యక్రమానికి హీరో విజయ్ సేతుపతి, దర్శకుడు శీను రామసామి (srinu ramasamy), నిర్మాత ఆర్కే సురేశ్ (Rk Suresh), హీరోయిన్ గాయత్రి (Gayathri) విచ్చేశారు.
ఈ సందర్బంగా హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ‘విక్రమ్’ చిత్రంలో అతిథి పాత్రలో నటించిన హీరో సూర్య, దర్శకుడు లోకేష్ కనకరాజ్కు హీరో కమల్ హాసన్ విలువైన బహుమతులు ఇచ్చారని, తనకు మాత్రం ఒక మహా నటుడితో కలిసి నటించే మహద్భాగ్యాన్ని కల్పించారని, ఇదే తనకు అతిపెద్ద బహుమతి అని ‘విక్రమ్’ విలన్ పాత్రధారి విజయ్ సేతుపతి అన్నారు. ఆయన హీరోగా దర్శకుడు శీను రామస్వామి తెరకెక్కించిన ‘మామనిదన్’ ఆడియో రిలీజ్ నగరంలో జరిగింది. ఇందులో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ‘గ్రామీణ నేపథ్యంలో కుటుంబ అనుబంధాలు, మనుషుల్లోని భావోద్వేగాలను తెరపై పండించడంలో శీను రామస్వామి వంటి దర్శకుడు నా దృష్టిలో లేరు. ఎంతో పెద్ద సమస్యనైనా చాలా చిన్నదిగా, సులభంగా చెప్పగల నైపుణ్యం ఆయనకు సొంతం. పలువురు హీరోయిన్లు నటించడానికి నిరాకరించిన పాత్రలో గాయత్రి హీరోయిన్గా నటించడం చాలా గొప్ప విషయం. ఇద్దరు పిల్లల తల్లి పాత్రలో ఆమె జీవించారు.
ఈ చిత్ర కథ ప్రతి ఒక్కరి ఇంట్లో జరుగుతున్నట్టుగా, మన కథనే చెబుతున్నట్టుగా ఉంటుంది. ఇళయరాజా (Ilayaraja), యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) లు కలిసి సంగీతం సమకూర్చడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. హీరో, నిర్మాత ఆర్.కె.సురేష్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం రూ.25 కోట్లు వసూలు చేస్తే దర్శకుడికి బెంజ్ కారు కొనుగోలు చేసి ఇస్తానని చెప్పాను. కథ అంత బాగుటుంది. ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది’ అన్నారు. దర్శకుడు శీను రామస్వామి మాట్లాడుతూ.. ‘వివిధ కారణాల వల్ల ఈ చిత్రం విడుదలలో తీవ్ర జాప్యం జరిగింది. గాయత్రి నటనకు జాతీయ అవార్డు వస్తుంది’ అన్నారు. హీరోయిన్ గాయత్రి కూడా మాట్లాడారు.