Shalini: మణిరత్నం సినిమాతో రీ ఎంట్రీ..?
ABN, First Publish Date - 2022-06-15T17:29:27+05:30
ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Maniratnam) ప్రస్తుతం 'పొన్నియిన్ సెల్వన్' (Ponniyin Selvan) అనే చారిత్రక కథను తెరపైకి తీసుకురాబోతున్నారు. చోళరాజుల కాలంతో ముడిపడిన కథ ఆధారంగా ఈ సినిమాను
ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Maniratnam) ప్రస్తుతం 'పొన్నియిన్ సెల్వన్' (Ponniyin Selvan) అనే చారిత్రక కథను తెరపైకి తీసుకురాబోతున్నారు. చోళరాజుల కాలంతో ముడిపడిన కథ ఆధారంగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ మల్టీస్టారర్గా తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిరత్నం కూడా భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు.
కాగా, 'పొన్నియిన్ సెల్వన్' మొదటి భాగాన్ని సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇందులో విక్రమ్ (Vikram), కార్తి (Karthi), జయం రవి (Jayam Ravi), ప్రభు, ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, పార్తీబన్, ఐశ్వర్య రాయ్, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ, త్రిష (Trisha) ప్రధానమైన పాత్రలలో నటిస్తున్నారు. అయితే, ఇదే సినిమాలో అజిత్ (Ajith) భార్య షాలినీ (Shalini) కూడా ఓ అతిథి పాత్రలో కనిపించనుందనే లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
బాలనటిగా పలు చిత్రాల్లో నటించిన షాలినీ, మణిరత్నం రూపొందించిన 'సఖి' సినిమాతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అజిత్తో వివాహమైన తరువాత ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. మళ్ళీ ఇంతకాలానికి షాలినీ 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో అతిథి పాత్రలో కనిపించనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, ఇందులో నిజం లేదని అజిత్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయట. దీనిపై మణిరత్నం గానీ, అజిత్ - షాలినీ గానీ స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.