పదేళ్లలో మొదటిసారి 2 లక్షల సబ్స్క్రైబర్స్ని కోల్పోయిన Netflix.. దిద్దుబాటు చర్యగా కొత్త ప్రయోగం
ABN , First Publish Date - 2022-05-17T17:04:32+05:30 IST
కరోనా కాలంలో అందరూ దాదాపు ఇంటికే పరిమితం అయ్యారు. ఆ సమయంలో అన్ని రంగాలు దాదాపు కుదేలయ్యాయి...
కరోనా కాలంలో అందరూ దాదాపు ఇంటికే పరిమితం అయ్యారు. ఆ సమయంలో అన్ని రంగాలు దాదాపు కుదేలయ్యాయి. ప్రేక్షకులకు వినోదాన్ని పంచే థియేటర్స్ అయితే చాలా కాలం తెరవడం కుదరలేదు. కానీ ఓ రంగానికి మాత్రం ఆ మహమ్మారి బాగా ఉపయోగపడింది. అదే OTT రంగం. లాక్డౌన్ కారణంగా బోర్గా ఫీల్ అవుతున్న జనాలను వెబ్సిరీస్లు, సినిమాలు అంటూ ఎంటర్టైన్ చేసింది. అయితే.. పరిస్థితులు మెరుగుపడ్డ తర్వాత వాటి హవా కొంచెం తగ్గే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్తో ముందుకు వస్తూ వ్యూయర్షిప్ని పెంచుకుంటూ వెళ్లాయి.
అన్నింటిలో Netflix ఓటీటీ రంగంలో ఎక్కువ మార్కెట్ షేర్ని కొల్లగొట్టింది. దాదాపు పదేళ్లపాటు ఇలా తన సబ్స్క్రైబర్స్ని పెంచుకుంటూ వెళ్లిన ఈ ప్రముఖ ఓటీటీ ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా 2 లక్షల సబ్స్క్రైబర్స్ని కోల్పోయింది. దీని షేర్ వ్యాల్యూ సైతం దాదాపు 40 శాతం పడిపోయింది. దీంతో ఈ కంపెనీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకి దిగింది.
అందులో భాగంగా స్టాండప్ కామెడీ స్పెషల్స్, అన్ స్ర్కీప్టెడ్ షోస్ని ప్రత్యక్ష ప్రసారం (Live Streaming) చేయాలని మెనేజ్మెంట్ భావిస్తోంది. అంతేకాకుండా ఇందులో ఓటింగ్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. అందుకోసం ప్రముఖ రియాలిటీ షో మేకర్స్ అయిన సన్ సెట్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియాలో ఐపీఎల్ని లైవ్ స్ట్రీమింగ్ చేయడం వల్ల సబ్స్క్రిప్షన్స్లో మేజర్ షేర్ని డిస్నీ ప్లస్ హట్స్టార్ కొల్లగొట్టింది. దీంతో నెట్ఫ్లిక్స్ సైతం అలా స్పోర్ట్స్ని లైవ్ స్ట్రీమింగ్ చేయాలని భావిస్తోందని సమాచారం.