ప్లీజ్.. ‘బొద్దు’గా ఉన్నావంటూ హేళన చేయవద్దు: హీరోయిన్ వినతి
ABN , First Publish Date - 2022-05-01T02:55:00+05:30 IST
మలయాళంలో బాలనటిగా వెండితెరకు పరిచయమైన నటి మంజిమా మోహన్. ఆ తర్వాత ఆమె తమిళంలో ‘అచ్చం ఎన్బదు మడమైయడా’ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ నుంచి
మలయాళంలో బాలనటిగా వెండితెరకు పరిచయమైన నటి మంజిమా మోహన్ (Manjima Mohan). ఆ తర్వాత ఆమె తమిళంలో ‘అచ్చం ఎన్బదు మడమైయడా’ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ నుంచి ‘క్షత్రియన్’, ‘దేవరాట్టం’, ‘ఎఫ్ఐఆర్’ వంటి పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం ‘తలైవి’ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ తెరకెక్కించే ఓ చిత్రంలో నటిస్తోంది. అయితే ఈ మధ్య మంజిమా కాస్త వళ్ళు చేయడంతో బొద్దుగా కనిపిస్తోంది. దీంతో ఆమె శరీరాకృతిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వీటికి ఆమె తనదైనశైలిలో సమాధానమిచ్చింది.
‘‘ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటారు. కొందరు సహజసిద్ధంగానే లావుగా ఉంటారు. అందుకని ఏ ఒక్కరినీ తప్పుపట్టడానికి వీల్లేదు. అందువల్ల దయచేసి ఒకరి శరీరాకృతిపై కామెంట్స్ చేయవద్దు. మీరు కామెంట్స్ చేయడం వల్ల బొద్దుగా ఉన్నవారు నాజుగ్గా మారిపోతారా? ఇలాంటి వ్యాఖ్యల వల్ల వారిలోని ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. శరీర బరువు పెరగడం అనేది వారివారి వ్యక్తిగత ఆరోగ్య లక్షణాలను బట్టి ఉంటుంది. దయచేసి ఈ విషయంలో ఏ ఒక్కరినీ హేళన చేయవద్దు’’ అని మంజిమా మోహన్ కోరింది.