Aishwarya Rai : అలా.. ప్రతీకారం తీర్చుకుంటుందా?
ABN, First Publish Date - 2022-09-16T18:26:17+05:30
ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తమిళ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ (Poinniyin Selvan). తమిళనాట ఎంతో పాపులర్ అయిన నవలకు తెరరూపమే ఈ సినిమా. 1950లో దివంగత ప్రఖ్యాత రచయిత కల్కి (Kalki) చారిత్రాత్మక నేపథ్యంలో రచించిన నవలిది.
ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తమిళ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ (Poinniyin Selvan). తమిళనాట ఎంతో పాపులర్ అయిన నవలకు తెరరూపమే ఈ సినిమా. 1950లో దివంగత ప్రఖ్యాత రచయిత కల్కి (Kalki) చారిత్రాత్మక నేపథ్యంలో రచించిన నవలిది. కల్కీ అనే పత్రికలో సీరియల్గా వచ్చిన ఈ నవల అప్పట్లో అత్యధిక ఆదరణ పొందింది. దీన్ని సినిమాగా తీయడానికి అప్పటి యం.జీ.ఆర్ (MGR) నుంచి ఇప్పటి కమల్ హాసన్ (Kamal Haasan) వరకూ ఎందరో ప్రయత్నించారు. దర్శకుడు మణిరత్నం (Manirathnam) కూడా అలాగే రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే ఆయన పట్టుదలతో మూడో సారి ఇప్పుడు సాధ్యమవుతోంది.
‘పొన్నియిన్ సెల్వన్’ మూవీ రెండు భాగాలుగా రానుండగా.. అందులోని మొదటి భాగం ఈ నెల 30న పాన్ ఇండియా చిత్రంగా విడుదల కాబోతోంది. విక్రమ్, జయం రవి, కార్తి, శరత్ కుమార్ , ప్రకాశ్ రాజ్ లాంటి భారీ తారగణంతో చిత్రం తెరకెక్కింది. ఈ నేపథ్యంలో ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai) పోషించిన నందిని పాత్ర గురించి ప్రత్యేకించి మాట్లాడుకుంటున్నారు.
ఈ సినిమా ఛోళరాజుల కాలం నేపథ్యంలో సాగే హిస్టారికల్ ఫిక్షనల్ స్టోరీ. ఇందులో ఐశ్వర్యారాయ్ నందిని అనే రాజకుమారి పాత్రను పోషిస్తోంది. ఆమె పాండ్యదేశానికి చెందిన యువతి. అతిలోక సుందరి, అంతకుమించి ప్రతీకారంతో రగిలిపోయే యువతి. తన ప్రేమికుడు వీరపాండ్యన్ అనే పాండ్యదేశ రాజు తలను తన కళ్ళముందే నరికేసిన ఛోళరాజు ఆదిత్య కరికాలన్ పై ప్రతీకారం తీర్చుకొని ఆ దేశాన్ని నాశనం చేయడానికి కుట్రపన్నే రాణిగా ఐశ్వర్య నటిస్తున్నట్టు సమాచారం. వీరపాండ్యన్ గా నాజర్ (Nassar) నటిస్తుండగా, ఆదిత్య కరికాలన్గా చియాన్ విక్రమ్ (Chiyan Vikram) నటిస్తుండడం విశేషం. ఐశ్వర్యారాయ్, విక్రమ్లతోనే మణిరత్నం గతంలో ‘రావణన్’ (Ravanan) అనే చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా అంతగా ఆడలేదు. అయితే ఈ సారి మణిరత్నం ఈ ఇద్దరినీ బద్ధ శత్రువులుగా మార్చేయడం గమనార్హం. మరి నందినిగా ఐశ్వర్యారాయ్ ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.