నా లైఫ్లో అలా.. లోగోను చూడాలని అనుకుంటున్నా: దిల్ రాజు
ABN , First Publish Date - 2022-01-28T03:20:08+05:30 IST
డిస్ట్రిబ్యూటర్గా ప్రయాణం మొదలెట్టిన నేను ఆ తర్వాత ఏంటి? అనుకున్నప్పుడు నిర్మాతగా మారాలని అనుకున్నాను. 2003లో ‘దిల్’ సినిమాతో నిర్మాతగా జర్నీ స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి కొత్త వాళ్లని పరిచయం చేస్తూ ‘ఆర్య, బొమ్మరిల్లు, మున్నా’.. ఇలా వరుస సినిమాలు చేస్తూ వచ్చాను. ఇలా ప్రతి సినిమాకు

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నిర్మాత దిల్ రాజు.. ఇప్పుడు దిల్రాజు ప్రొడక్షన్స్ పేరిట మరో బ్యానర్ను స్థాపించి.. డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్, జీ 5 కలయికలో రూపొందిన ఒరిజినల్ వెబ్ సిరీష్ ఏటీఎమ్ (ఎనీ టైమ్ మెమొరీ). శిరీష్ సమర్పణలో ఎస్.హరీష్ శంకర్, హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా ఈ వెబ్ సిరీస్ రూపొందుతుంది. ఈ వెబ్ సిరీస్కి సంబంధించిన అనౌన్స్మెంట్ వేడుక గురువారం హైదరాబాద్లో జరిగింది.
ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘డిస్ట్రిబ్యూటర్గా ప్రయాణం మొదలెట్టిన నేను ఆ తర్వాత ఏంటి? అనుకున్నప్పుడు నిర్మాతగా మారాలని అనుకున్నాను. 2003లో ‘దిల్’ సినిమాతో నిర్మాతగా జర్నీ స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి కొత్త వాళ్లని పరిచయం చేస్తూ ‘ఆర్య, బొమ్మరిల్లు, మున్నా’.. ఇలా వరుస సినిమాలు చేస్తూ వచ్చాను. ఇలా ప్రతి సినిమాకు ఇది దిల్ రాజుగారి సినిమా అనే స్థాయికి చేరుకోగలిగాను. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా, సంస్థగా ఎదిగాం. స్టార్స్తో, కొత్తవాళ్లతో మంచి సినిమాలను అందిస్తూ ఇక్కడి వరకు ప్రయాణించాం. ఈ స్టేజ్లో మేము ఉండటానికి ఎంతో మంది దర్శకుల కృషి ఉంది. నిర్మాతగా 50 సినిమాలను పూర్తి చేయబోతున్నాం. సినిమాలో మార్పులు వస్తున్నాయి. వాట్ నెక్ట్స్ అనే ప్రశ్న మళ్లీ ఎదురైంది. ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్స్ను స్టార్ట్ చేశాను. ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనిపించింది. హిందీలో సక్సెస్ఫుల్గా ‘హిట్, జెర్సీ’ సినిమాలను పూర్తి చేయగలిగాం. అలా బాలీవుడ్లో దిల్రాజు ప్రొడక్షన్స్ ఎంట్రీ ఇవ్వనుంది.
ఇక తెలుగులో కొత్తగా ఏం చేయాలి అని అనుకున్నప్పుడు .. కొత్త జనరేషన్ రెడీగా ఉంది. హర్షిత్, హన్షితను అడిగినప్పుడు వాళ్లు రెడీ అన్నారు. నేను, శిరీష్.. వాళ్లకి బాధ్యతలను అప్పగించాం. ముందు సినిమాలను చేయించాలని అనుకున్నాం. అయితే గత రెండేళ్లుగా కంటెంట్లో మార్పు వచ్చింది. అదే సమయంలో హరీష్ శంకర్ నాకు ఫోన్ చేసి ఇలా చంద్రమోహన్ కాన్సెప్ట్ గురించి చెప్పాడు. నేను విన్నాను. తర్వాత జీ 5తో ఉన్న అనుబంధంతో వాళ్లతో కలిసి ప్రయాణించాం. హరీష్ శంకర్, హన్షిత, హర్షిత్ నిర్మాతలుగా ఈ ఏటీఎం అనే వెబ్ సిరీస్ చేయాలనుకుని ముందుకు వచ్చాం. 2022లో ఏటీఎం వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాం. కొత్త కాన్సెప్ట్తో హరీష్ శంకర్ మార్క్ ఎంటర్టైన్మెంట్తో అన్ని ఎలిమెంట్స్ మిక్స్ చేసి వెబ్ సిరీస్ చేశాం. మా బ్రాండ్ వేల్యూతో మీ ముందుకు వస్తున్నాం. దీనికి శిరీష్ సమర్పకుడిగా ఉంటారు. ఎస్.హరీష్ శంకర్, హర్షిత్, హన్షిత నిర్మాతలుగా ఉంటారు. వెబ్ సిరీస్తో పాటు కొత్త కంటెంట్ సినిమాలను కూడా వాళ్లు చేయబోతున్నారు. త్వరలోనే ఆ వివరాలను ప్రకటిస్తారు. హన్షిత, హర్షిత్ వీరే దిల్ రాజు ప్రొడక్షన్స్ను ముందుకు తీసుకెళ్లాలి. నా లైఫ్లో సురేష్ ప్రొడక్షన్స్లా 50 ఏళ్ల లోగోను చూడాలని అనుకుంటున్నాను’’ అన్నారు.