‘లూసీఫర్’ చూసి రండి.. ఇంకా నచ్చుతుంది
ABN, First Publish Date - 2022-10-04T10:50:53+05:30
దర్శకుడు మోహన్ రాజాని అంతా ‘రీమేక్ రాజా’ అని పిలుస్తారు. కారణమేంటో తెలుసా? ఆయన తమిళంలో తీసిన సినిమాల్లో దాదాపుగా తెలుగు రీమేకులే ఎక్కువ...
దర్శకుడు మోహన్ రాజాని అంతా ‘రీమేక్ రాజా’ అని పిలుస్తారు. కారణమేంటో తెలుసా? ఆయన తమిళంలో తీసిన సినిమాల్లో దాదాపుగా తెలుగు రీమేకులే ఎక్కువ. ‘జయం’, ‘బొమ్మరిల్లు’, ‘అమ్మానాన్న తమిళ అమ్మాయి’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ఈ సినిమాల్ని తమిళంలో రీమేకులు చేసి హిట్ కొట్టారు. ఇప్పుడు మలయాళ ‘లూసీఫర్’ని తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా తీసింది కూడా ఈయనే. బుధవారం ‘గాడ్ ఫాదర్’ విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మోహన్ రాజా ఏమన్నారంటే..?
‘‘చిరంజీవిగారితో సినిమా చేయడం అంటే ఏ దర్శకుడికైనా కల. నా కల ‘గాడ్ ఫాదర్’తో నిజమైంది. అంత పెద్ద స్టార్ సెట్లో ఎలా ఉంటారా? అని భయపడ్డా. కానీ ఆయన చాలా కూల్. ‘లూసీఫర్’ లాంటి కథని ఇండియాలో నలుగురైదుగురు స్టార్లే చేయగలరు. అందులో చిరంజీవి గారు ఒకరు. సాధారణంగా చిరంజీవి గారి సినిమాల్లో ఆయన పాత్ర ఒక్కటే హైలెట్ అయితే సరిపోతుంది. ‘గాడ్ ఫాదర్’లో ఆయనే కాదు. కనీసం పది పాత్రలకు మంచి పేరొస్తుంది’’.
‘‘లూసీఫర్ సినిమాని మలయాళంలో తీసిన పృథ్వీరాజ్ కంటే నేనే ఎక్కువ ప్రేమించా. ఆ సినిమాకి నాకంటే పెద్ద అభిమాని ఉండడు. అందులో ప్లస్సులు, మైనస్సులూ నాకు బాగా తెలుసు. ‘లూసీఫర్’లో ఎవరూ చూడని కోణం ఒకటి ‘గాడ్ ఫాదర్’లో కనిపిస్తుంది. ‘లూసీఫర్’ అనేది పది మెట్లు ఎక్కిస్తే... మేం పదకొండో మెట్టు ఎక్కాం. ‘లూసీఫర్’ చూసి ‘గాడ్ ఫాదర్’ చూడండి.. ఇంకాస్త బాగా నచ్చుతుంది’’
‘‘నన్నంతా రీమేక్ రాజా అని పిలుస్తారు. దాన్ని నేను ప్రశంసగానే తీసుకొంటా. ఎందుకంటే రీమేకులు చేయడం అంత ఈజీ కాదు. నేను చేసిన ప్రతీ రీమేక్తోనూ ఎంతో కొంత తెలుసుకోగలిగాను. ‘ఽతని ఒరువన్’కి సీక్వెల్ చేసే ఆలోచన ఉంది. ‘గాడ్ ఫాదర్’ కథనీ కొనసాగించ వచ్చు. అంత స్కోప్ ఈ కథకు ఉంది. త్వరలో నాగార్జున గారితో ఓ సినిమా చేస్తున్నా’’