PS 1: వెయ్యేళ్ల క్రితం జరిగిన చరిత్రను చూపించబోతున్నాం
ABN , First Publish Date - 2022-08-20T02:38:50+05:30 IST
చియాన్ విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్, ప్రభు, పార్తిబన్, ప్రకాష్రాజ్ కీలక పాత్రల్లో ఏస్ డైరెక్టర్ మణిరత్నం
చియాన్ విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్, ప్రభు, పార్తిబన్, ప్రకాష్రాజ్ కీలక పాత్రల్లో ఏస్ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వం వహిస్తున్న ప్రెస్టీజియస్ సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan). లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. పీయస్-1ని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో ఈ సినిమాను ఏక కాలంలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘చోళ చోళ’ (Chola Chola) పాటను విడుదల చేసేందుకు హైదరాబాద్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) మాట్లాడుతూ.. ‘‘నాకు మణి సర్తో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఆయనతో ఇది వరకు ‘రావణ్’ సినిమా చేశాను. ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాను. మణిగారితో పని చేస్తున్నానంటే.. అది నాకు కల నెరవేరడం వంటిది. మణిగారు, శంకర్ (Shankar)గారితో సినిమా చేస్తే ఇక రిటైర్ అవ్వొచ్చని అనుకుంటూ ఉంటాను. అంత అద్భుతమైన చిత్రాలు చేస్తారు. మణిగారి సినిమాలో ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు థాంక్స్’’ అని అన్నారు.
కార్తీ (Karthi) మాట్లాడుతూ.. ‘‘మణిరత్నంగారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాను. ఇప్పుడు ఈ చిత్రంలో ఓ మంచి పాత్రను చేశాను. ఎవరెవరికో దక్కాల్సిన పాత్ర నాకు దక్కింది. కల్కిగారు రాసిన నవలే ఈ ‘పొన్నియన్ సెల్వన్’. ఎంతో మంది ఈ నవలను సినిమాను తీయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు మణిగారి వల్ల ఈ చిత్రం తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. తోటి నటీనటుల వల్ల ఎంతో నేర్చుకున్నాను. ప్రతీ ఒక్క పాత్రకు ఓ లక్ష్యం ఉంటుంది. ఆ గమనంలో ఉండే డ్రామా అద్భుతంగా ఉంటుంది. ఈ కథ నేల మీద, సముద్రాలు, అడవుల్లో జరుగుతుంది. ఇలాంటి చిత్రాలు తీయాలంటే మణిరత్నంగారు, ఏఆర్ రెహ్మాన్గారు ఉండాలి. అప్పట్లోని రాజకీయాల మీద ఈ చిత్రం ఉంటుంది. రియల్ పాత్రల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చాలా రీసెర్చ్ చేసి ఈ నవలను రాశారు. అత్యధికమంది కొన్న పుస్తకంగా పొన్నియన్ సెల్వన్ రికార్డులు క్రియేట్ చేసింది. రవివర్మన్ కెమెరా పనితనం మీరు చూడబోతున్నారు. వెయ్యేళ్ల క్రితం జరిగిన చరిత్రను చూపించేందుకు రాబోతున్నాం’’ అని అన్నారు.