మట్టిమనిషి కథ
ABN , First Publish Date - 2022-05-26T06:34:43+05:30 IST
సన్నీ నవీన్, రోహిణీ రేచల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘జైత్ర’. ఈ సినిమాతో తోట మల్లికార్జున దర్శకుడిగా పరిచయమవుతున్నారు...
సన్నీ నవీన్, రోహిణీ రేచల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘జైత్ర’. ఈ సినిమాతో తోట మల్లికార్జున దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సురేశ్ కొండేటి, అల్లం సుభాష్ నిర్మాతలు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్ను గురువారం ప్రసాద్ ల్యాబ్లో జరిగిన ఓ కార్యక్రమంలో దర్శకుడు వెంకీ కుడుముల రిలీజ్ చేశారు. అలాగే పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వెంకీ మాట్లాడుతూ ‘ఈ చిత్రదర్శకుడు మల్లికార్జున నా దగ్గర పనిచేశాడు. ‘ఛలో’ సినిమా చేస్తుండగా నేను సీన్స్ గురించి చెబితే మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పేవాడు. ఆ నిజాయతీతోనే ఈ సినిమా తీసి ఉంటాడని నమ్ముతున్నాను. సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ‘రాయలసీమలో జోడెద్దులు, నాలుగున్నర ఎకరాల భూమి ఉన్న భాగ్యవంతుడి కథ. ఒక్క మాటలో చెప్పాలంటే మట్టిమనిషి కథ ఇది’ అన్నారు దర్శకుడు మల్లికార్జున. నిర్మాతల్లో ఒకరైన సురేశ్ కొండేటి మాట్లాడుతూ ‘నేను ఇంతకుముందు తీసిన ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’, ‘పిజ్జా’ చిత్రాలు మంచి కంటెంట్ కలిగి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమాలో కూడా మంచి కంటెంట్ ఉంది. దర్శకుడు మల్లికార్జున సినిమాను బాగా తీశారు. ఫస్ట్ కాపీ చూసి సంతృప్తి చెందాం’ అన్నారు. మరో నిర్మాత అల్లం సుభాష్ మాట్లాడుతూ ‘రాయలసీమ యాస కలిగిన మట్టి మనుషుల కథ ఇది. అందరికీ కనెక్ట్ అవుతుంది’ అని చెప్పారు.