ఆరోజు రిటైర్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్లిపోవచ్చు
ABN , First Publish Date - 2022-12-28T02:53:38+05:30 IST
‘‘పని చేయాలనే తపన అడుగడుగునా ఉండాలి. గొడ్డులా కష్టపడాలి. ఆకలి తగ్గి, రిలాక్స్ అయిపోయి ‘ఇక చాల్లే..’ అనుకొంటే ఎవరైనా సరే, ఆ రోజున రిటైర్మెంట్ తీసుకొని ఇంటికెళ్లిపోవొచ్చు..’’ అన్నారు చిరంజీవి.
‘‘పని చేయాలనే తపన అడుగడుగునా ఉండాలి. గొడ్డులా కష్టపడాలి. ఆకలి తగ్గి, రిలాక్స్ అయిపోయి ‘ఇక చాల్లే..’ అనుకొంటే ఎవరైనా సరే, ఆ రోజున రిటైర్మెంట్ తీసుకొని ఇంటికెళ్లిపోవొచ్చు..’’ అన్నారు చిరంజీవి. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. రవితేజ కీలక పాత్రధారి. బాబి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ఈ చిత్రం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం ‘వాల్తేరు వీరయ్య’ సెట్లో చిత్రబృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. చిరంజీవి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కోసం ఎవరూ డబ్బులు తీసుకొని పని చేయలేదు. ప్రేమించి పని చేశారు. కొన్ని సినిమాల గురించి విడుదలకు ముందు ఏం చెప్పకూడదు. ఏం చెప్పినా అంచనాలు పెరిగిపోతాయి. కానీ ఈ సినిమా అలా కాదు. ఎన్ని అంచనాలు వేసుకొని వచ్చినా.. దానికి మించేలా ఉంటుంది. ఇది రొటీన్ కథ కావొచ్చు. కానీ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలూ చక్కగా పొందిపరిచారు. నాకు సెట్కి వెళ్లగానే ‘గ్యాంగ్ లీడర్’, ‘ముఠా మేస్ర్తీ’ సినిమాలు గుర్తుకొచ్చాయి. ‘శంకర్ దాదా’ తరవాత అంత ఎంటర్టైన్మెంట్ అందించే పాత్ర ఇదే. బాబి నా అభిమాని. సెట్లో ఏదైనా సరే నటించి చూపించేవాడు. తను చేసింది.. తిరిగి కెమెరా ముందు చేస్తే సరిపోయేది. మొదటిసారి... బ్రెయిన్ని ఫ్రిడ్జ్లో ఉంచి బాడీతో సెట్కి వెళ్లా. నా అభిరుచితో సినిమాలు చేస్తే.. ‘బాగుంది’ అని అంతా మెచ్చుకొంటారేమో..? అభిమానులకు ఏం కావాలో అలాంటి సినిమాలు తీస్తే.. సినిమాలూ బాగుంటాయి. అందుకే అభిమానులకు నచ్చే సినిమాలే చేస్తా. ఈ సంక్రాంతికి నాతో పాటు బాలకృష్ణ సినిమా కూడా విడుదల అవుతోంది. రెండు సినిమాలూ హిట్టవుతాయ’’న్నారు. రవితేజ మాట్లాడుతూ ‘‘బాబిని నమ్మి చేసిన సినిమా ఇది. అన్నయ్యతో నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా పూర్తి మాంసాహార భోజనంలా ఉంటుంది’’ అన్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ఇది ‘మెగా మాస్’ సినిమా. ‘వాల్తేరు వీరయ్య’కి పని చేసిన వాళ్లంతా చిరంజీవి గారి అభిమానులే. ఆయనపై ఇష్టంతో చేసిన సినిమా ఇది. బాబీ ఈ కథని డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. శేఖర్ మాస్టర్ మంచి మూమెంట్స్ చేయించార’’న్నారు. నిర్మాతల్లో ఒకరైన రవి ఎర్నేని మాట్లాడుతూ ‘‘ఖర్చుకి ఎక్కడా వెనుకంజ వేయకుండా చేసిన సినిమా ఇది. చిరంజీవి గారి స్థాయికి తగినట్టే ఉంటుంది. రవితేజగారు ఈ టీమ్లోకి రావడం మరింత బలాన్ని ఇచ్చింది. దేవిశ్రీ మా కుటుంబ సభ్యుడు. తన సంగీతంతో ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లార’’న్నారు. బాబి మాట్లాడుతూ ‘‘చిరంజీవిగారి అభిమానిగా ఈ పరిశ్రమలోకి వచ్చాను. ఇప్పుడు చిరంజీవిగారి సినిమాకి దర్శకత్వం వహించే స్థాయికి చేరుకోవడం నా అదృష్టం. చిరంజీవి గారికి కథ చెప్పినప్పుడు ‘సెటప్పులు బాగున్నాయి.. కానీ కథేది’ అన్నారు. అప్పటికి నిజంగానే నా దగ్గర సెకండాఫ్ లేదు. ఆ తరవాత మళ్లీ కూర్చుని కథపై కసరత్తు చేసి, ఆయనకు వినిపించా. భుజం తట్టి సినిమా చేయమని ప్రోత్సహించారు. లాక్ డౌన్ సమయంలో.. రవితేజగారి పాత్ర పుట్టింది. అప్పటికే కథ ఓకే అయిపోయింది. ఇప్పుడు ‘మన సినిమాలో రవితేజగారు కూడా ఉంటారు’ అని కథ మార్చి చెబితే చిరంజీవి గారు ఎలా రిసీవ్ చేసుకొంటారో అని భయం వేసింది. కానీ.. సెకండ్ వెర్షన్ వినిపించినప్పుడు ‘ఇదే బాగుంది.. ఇలానే చేద్దాం’ అన్న చిరంజీవిగారి జడ్జిమెంట్కి హ్యాట్సాఫ్. ‘పూనకాలు లోడింగ్’ అనే క్యాష్షన్ ఊరికే పెట్టలేదు. నిజంగానే.. థియేటర్లో అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. దేవిశ్రీ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. తొలి సిట్టింగ్లోనే ‘వాల్తేరు వీరయ్య’ థీమ్ గీతం వచ్చేసింది. ఆ పాటని చంద్రబోస్ చాలా బాగా రాశార’’న్నారు.
హైదరాబాద్ శివార్లలో... వాల్తేరు వీరయ్య కోసం తీర్చిదిద్దిన సెట్లు