‘భీమ్లానాయక్’లో అందుకే ఆ సీన్లు పెట్టలేదు: దర్శకుడు సాగర్ కె చంద్ర
ABN, First Publish Date - 2022-02-28T22:32:10+05:30
ప్రాజెక్ట్లో పవన్కల్యాణ్గారి పేరు వినిపించగానే అదొక గొప్ప అనుభూతి. ఆయన్ను డైరెక్ట్ చేయాలంటే ఇన్నేళ్ల కష్టం.. క్యాలిబర్, ప్లానింగ్, క్రియేటివిటీ... ఇంత ఉంటే ఇది జరుగుతుంది అనుకోవడానికి లేదు. అలా కుదరాలి.. ఆ పని జరగాలి అంతే. అవన్నీ ప్లాన్ చేసుకుంటే...
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్లో.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సాగర్. కె చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు- స్ర్కీన్ప్లే అందించిన ఈ చిత్రం తాజాగా విడుదలై బ్లాక్బస్టర్ టాక్తో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. సినిమా సాధించిన సక్సెస్తో చాలా సంతోషంగా ఉన్నానని చిత్ర దర్శకుడు సాగర్ కె. చంద్ర తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘‘ఫస్ట్ లాక్డౌన్ సమయంలో నిర్మాత వంశీ గారు ఫోన్ చేసి ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రం గురించి మాట్లాడి, ఆ సినిమా చూసి అభిప్రాయం చెప్పమన్నారు. కొద్దిరోజులకు మళ్లీ ఫోన్ చేసి ఈ సినిమా చేద్దామనుకుంటున్నాం. నీకు ఇంట్రెస్ట్ ఉందా అనడిగారు. నేను వెంటనే ఓకే అన్నా. ఆ తర్వాత త్రివిక్రమ్గారితో జర్నీ మొదలైంది. ‘ఎలా చేద్దాం. తెలుగు ప్రేక్షకులకు కోసం ఎలాంటి మార్పులు చేద్దాం’ అన్న మాటలు మొదలయ్యాయి. ఆ తర్వాత పవన్కల్యాణ్, రానాగారు రావడంతో మరింత ఎగ్జైటింగ్గా ముందుకెళ్లాం. ప్రాజెక్ట్లో పవన్కల్యాణ్గారి పేరు వినిపించగానే అదొక గొప్ప అనుభూతి. ఆయన్ను డైరెక్ట్ చేయాలంటే ఇన్నేళ్ల కష్టం.. క్యాలిబర్, ప్లానింగ్, క్రియేటివిటీ... ఇంత ఉంటే ఇది జరుగుతుంది అనుకోవడానికి లేదు. అలా కుదరాలి.. ఆ పని జరగాలి అంతే. అవన్నీ ప్లాన్ చేసుకుంటే జరిగేవి కాదు. త్రివిక్రమ్గారితో చర్చల్లో కూర్చుని మొదట చర్చించింది కోషి పాత్రను భీమ్లాకు ఎలా మార్చాలి అనేదే. అసలు ఇది రీమేక్ అని మరిచిపోయాం. మెయిన్ కథ, కమర్షియల్ అంశాలు, పవన్-రానా పాత్రలు బ్యాలెన్స్ చేయడం వంటి అంశాల మీద ఎక్కువ దృష్టిపెట్టాం. దీని రీమేక్ హక్కులు మరొకరు తీసుకోవాలి అన్నట్లు పని చేయాలి అని త్రివిక్రమ్గారు ముందే చెప్పారు. ఆయన అన్న మాటను ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం అనుకుంటున్నా. రీమేక్లా కాకుండా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ లాంటి సినిమాను తెరకెక్కించాం అనుకుంటున్నాం. అలాగే ఒరిజినల్లో ఉన్న కొన్ని సన్నివేశాలను పవన్కల్యాణ్పై తీయలేదని చాలామంది అడుగుతున్నారు. అక్కడున్న అన్ని సన్నివేశాలు పెట్టాలంటే మన స్టోరీ టెల్లింగ్కు తేడా వస్తుంది. అందుకే కొన్నింటిని పక్కన పెట్టేశాం. తెలుగు ప్రేక్షకులకు ఏం కావాలో.. ఏ సీన్ పండుతుందో చెక్ చేసుకుని తీశాం.
స్టార్ హీరోలను డైరెక్ట్ చేయడం అనేది.. మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. త్రివిక్రమ్గారు రైటింగ్లో అయినా, డైరెక్షన్లో అయినా సీనియర్ పర్సనాలిటీ. ఆయన సజెషన్స్ ఏ టెక్నీషియన్కైనా అవసరమే! ఇద్దరు స్టార్స్తో కలిసి పనిచేయడం అనేది యుద్ధంలాగే ఉంటుంది. దానిని మనం ఎంతగా ఓన్ చేసుకున్నాం.. అవుట్పుట్ బాగా రావడానికి ఏం చేశాం అన్నది ముఖ్యం. ఆయన సహకారం లేకపోతే చిత్రం ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదు. నాయక్, డ్యాని రెండూ బలమైన పాత్రలు కాబట్టే తెరపై నువ్వా.. నేనా అన్నట్లు ఆ పాత్రలు కనిపించాయి. ‘భీమ్లానాయక్’ చేయడం వల్ల వచ్చిన పేరు, గుర్తింపుతో నేను చాలా ఆనందంగా ఉన్నా..’’ అని తెలిపారు.