అందుకే ‘కొండా’ బయోపిక్ తీశా!
ABN , First Publish Date - 2022-06-04T05:44:35+05:30 IST
కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో..
కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కొండా’. త్రిగుణ్, ఇర్రా మోర్ నటించారు. కొండా సుష్మితా పటేల్ నిర్మాత. ఈనెల 23న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్మ మాట్లాడుతూ ‘‘నేను ఇప్పటి వరకూ వాస్తవిక గాథల్ని తెరకెక్కించా. వాటిలో కొండా మురళి, సురేఖ కథలు కొత్తగా అనిపించాయి. ఇలాంటి వ్యక్తుల గురించి ఇంతకు ముందు ఎక్కడా వినలేదు. చదవలేదు. చాలా ప్రత్యేకంగా కనిపించాయి. వారిద్దరి గురించీ రిసెర్చ్ చేశా. ఇంకా ఆసక్తి పెరిగింది. అందుకే ‘కొండా’ బయోపిక్ రూపొందించా’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘1980 నేపథ్యంలో జరిగే కథ ఇది. వర్మ వాస్తవానికి చాలా దగ్గరగా తీశారు. మా అమ్మానాన్నల కథ ఇది. వాళ్ల జీవితం సాఫీగా సాగలేదు. ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నారు. సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర నేతగా ఎదిగారు. నా అభిమాన దర్శకుడు వర్మ. ఆయనతో సినిమా చేయడం ఆనందంగా ఉంద’’న్నారు.