Pawan Kalyan: కృష్ణ సేవలు చిరస్మరణీయం.. సంతాపం తెలిపిన పవన్ కళ్యాణ్

ABN , First Publish Date - 2022-11-15T15:33:44+05:30 IST

సూపర్‌స్టార్ కృష్ణ (Krishna) మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఈ విషయం తెలిసిన ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు..

Pawan Kalyan: కృష్ణ సేవలు చిరస్మరణీయం.. సంతాపం తెలిపిన పవన్ కళ్యాణ్

సూపర్‌స్టార్ కృష్ణ (Krishna) మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఈ విషయం తెలిసిన ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, కృష్ణ మృతికి సంతాపం తెలుపగా.. తాజాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా ఆయన మృతికి నివాళి అర్పించాడు.


‘చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన శ్రీ కృష్ణ గారు తుది శ్వాస విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది. శ్రీ కృష్ణగారు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. శ్రీ కృష్ణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. స్నేహశీలి, మృదుస్వభావి అయిన శ్రీ కృష్ణ గారు ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. మద్రాస్ లో ఉన్నప్పటి నుంచి మా కుటుంబంతో ఆయనకి చక్కటి అనుబంధం ఉంది.


తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా శ్రీ కృష్ణ గారు చేసిన సేవలు చిరస్మరణీయాలు. తెలుగు సినిమా పురోగమన ప్రస్థానంలో ఆయన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు. విభిన్న పాత్రలు పోషించిన శ్రీ కృష్ణ గారు కౌబోయ్, జేమ్స్ బాండ్ కథలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించారు. పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా జీవితంలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు.


సినిమా రంగం క్షేమాన్ని కాంక్షించే శ్రీ కృష్ణ గారి మరణం తెలుగు చలనచిత్ర సీమకు తీరని లోటు. ఆయన కుమారుడు శ్రీ మహేష్ బాబు గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-11-15T15:33:44+05:30 IST