Lessons from Kanthara: 'కాంతారా' చాలా నేర్పింది!

ABN , First Publish Date - 2022-10-19T19:21:56+05:30 IST

'కాంతారా' అనే సినిమా ఎందుకు అంతలా ఆడుతోంది. ఎందుకు దేశంలోని సెలబ్రిటీస్ అందరూ ఈ సినిమాని అంతగా పొగుడుతున్నారు. ఇందులో నటించిన రిషబ్ శెట్టి (Rishab Shetty) ఒక్కసారిగా పెద్ద స్టార్ అయిపోయాడు.

Lessons from Kanthara: 'కాంతారా' చాలా నేర్పింది!


సురేష్ కవిరాయని 


గత వారం విడుదల అయిన 'కాంతారా' (Kanthaara) అనే సినిమా ఒక సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో పెద్ద స్టార్స్ లేరు, మలయాళం నుండి ఒక నటుడు, హిందీ నుండి ఒక అనుపమ్ ఖేర్ (Anupam Kher), ముఖేష్ రిషి (Mukesh Rishi), మురళి శర్మ (Murali Sharma), బొమ్మని ఇరానీ (Bomman Irani), సచిన్ ఖేడేకర్ (Sachin Khedekar) లాంటి నటులు కూడా ఎవరూ లేరు. పోనీ సంగీత దర్శకుడు కూడా ఏ థమన్ (Music director SS Thaman) లానో, దేవి ప్రసాద్ (Devi Prasad) లానో, గోపి సుందర్ (Gopi Sundar) లానో పెద్ద పేరున్న వాళ్ళు కాదు. అలాగే సినిమాటోగ్రాఫర్ కూడా. ఈ సినిమాకి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువే. కానీ ఈ సినిమా ఒక్క కన్నడం లోనే కాదు, భారత దేశం అంతా విజయవంతంగా ఆడుతూ సంచలనాల దిశగా వెళుతోంది. మొన్నటి వరకు చివరగా వున్న కన్నడ పరిశ్రమ ఈరోజు అందరికంటే ముందు వుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇలా చెపుతూ వుంటారు కదా, కానీ ఇప్పుడు కన్నడ ముందు వచ్చింది, తరువాతే మిగతావి వున్నాయి. 



మరి అన్ని డబ్బులు పెట్టకపోయినా, పెద్ద స్టార్స్ లేకపోయినా, ఈ 'కాంతారా' అనే సినిమా ఎందుకు అంతలా  ఆడుతోంది. ఎందుకు దేశంలోని సెలబ్రిటీస్ అందరూ ఈ సినిమాని అంతగా పొగుడుతున్నారు. ఇందులో నటించిన రిషబ్ శెట్టి (Rishab Shetty) ఒక్కసారిగా పెద్ద స్టార్ అయిపోయాడు. నేను కూడా ఈ రిషబ్ శెట్టి సినిమా చూడటం ఇదే మొదటిసారి. ఎంత బాగా చేశాడురా అని అబ్బురపడి, ఇప్పుడు అతని ముందు చేసిన సినిమాలు ఎక్కడ దొరుకుతాయో అని వెతికి మరీ చూడాల్సి వస్తోంది. అంతా అద్భుతంగా చేశాడు రిషబ్ శెట్టి.  మరి దీని నుండి తెలుగు ఫిలిం మేకర్స్ ఏమి నేర్చుకుంటున్నారు. 



తెలుగు దర్శకులు పాన్ ఇండియా పేరిట 200 నుండి 400 కోట్ల వరకు బడ్జెట్ పెట్టి, దానికి తోడు, అన్ని భాషల నుండి ఒక్కో నటుడిని తీసుకొని, హాలీవుడ్ నుండి కూడా నటుల్ని, ఒక్కోసారి సాంకేతిక నిపుణులను తెచ్చుకొని, కంప్యూటర్ గ్రాఫిక్స్ కి ఇంకా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి, ఇంత చేసి సినిమా తీసిన ఆడుతుందో ఆడదో తెలియని పరిస్థితి.  మళ్ళీ పాన్ ఇండియా అంటూ, ముందే ఓటిటి, శాటిలైట్ హక్కులు అంటాం, అమ్మేస్తాం, ఇంత డబ్బు పెట్టి, ఒక రెండేళ్లు దాని మీద కూర్చొని సినిమా తీసి విజయం సాధిస్తే పేరు, లేకపోతే తుస్సుమంటుంది సినిమా. 

మరి 'కాంతారా ' సినిమాలో ఇవేమి లేవే. మరి ఎందుకు ఆడింది. అంటే, అందులో లోకల్ నేటివిటీ వుంది. తన చుట్టూ జరిగే కథనే ఎంచుకున్నాడు రిషబ్ శెట్టి. ఎక్కడో కథ తెచ్చి పాన్ ఇండియా సినిమా తీస్తున్నాను అని చెప్పలేదు. తన పరిసరాల్లో జరిగిన కథని పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లాడు. కర్ణాటక లోని ఒక ప్రాంతంలో జరిగిన కథ, అక్కడి సంప్రదాయాలకు విలువ ఇస్తూనే, అద్భుతంగా చిత్రీకరించాడు. రిషబ్ శెట్టి దర్శకుడు, అలాగే ఇందులో అద్భుతమయిన నటన ప్రదర్శించాడు. మొత్తం నటీనటులు అందరినీ అక్కడ ఉన్నవాళ్ళనే తీసుకున్నాడు. హిందీ, తమిళ్, మలయాళం, తెలుగు నుండి ఎవరిని దిగుమతి చేసుకోలేదు. అలాగే సాంకేతిక సహాయం అందించిన వాళ్ళని కూడా లోకల్ గానే తీసుకున్నాడు. ఆలా తీసుకుంటేనే తాను చెప్పదలుచుకున్న కథకి న్యాయం చెయ్యగలను అని అనుకున్నాడు. అందుకే అక్కడ వాళ్ళనే తీసుకొని, ఈరోజు వాళ్ళందరిని ఇండియా లెవెల్ కి తీసుకెళ్లాడు. అదీ సినిమా తీయడం అంటే, చేయడం అంటే, చూపించండం అంటే. 



'కాంతరా' సినిమా ఒక అద్భుతం, రిషబ్ శెట్టి ఒక చిన్న బడ్జెట్ లోనే సినిమా తీసి దానితో అద్భుతాలు ఎలా జరగొచ్చే చేసి చూపాడు. ఈరోజు అంతా బెంగుళూరు (Benguluru) గురించి కాదు, మంగుళూరు (Manguluru) గురించి మాట్లాడుతున్నారు. ఆ సినిమా అంతలా ప్రభావితం చేసింది. మరి దీన్ని నుంచి తెలుగు వాళ్ళు, ఇతర బాషాల సినిమా పరిశ్రమ వాళ్ళు నేర్చుకొని ఆ బాటలో వెళతారా, లేదా రీమేక్ అంటూ, హాలీవుడ్ (Hollywood), కొరియా (Korean) సినిమాల కథలు అంటూ ఏవేవో పిచ్చి కథలు తీసి మన తెలుగు కథలని విస్మరిస్తారా? 'కాంతారా' ని చూసి నేర్చుకోవాల్సింది చాలా వుంది. 

పోనీ ఎవరయినా చిన్న సినిమా తీసి ఆలా సక్సెస్ అయితే, ఇప్పుడు ఒక్కొక్కరు నాలుగయిదు సినిమాలు తీస్తూ పెద్ద నిర్మాతలం అని చెప్పుకుంటూ వున్నవాళ్లు, ఆ చిన్న సినిమా దర్శకుడిని, నటుడిని అడ్వాన్స్ ఇచ్చి తమతో పెద్ద సినిమా ప్లాన్ చెయ్యాలని చెప్పి వాళ్ళని అలాగే పక్కన పెడుతున్నారు. వాళ్ళు ఆ పెద్ద సినిమా కోసం చూస్తూ, ఇతి చిన్న సినిమా తీయలేక, ఎటూ పాలుపోక పెద్ద స్టార్ కోసం కథ తయారుచేసుకొని, ఒక చేత సినిమా ఇస్తున్నారు. ఎందుకంటే స్టార్ ని బట్టి కథ రాసుకోవటం కాదు, కథని బట్టి నటుల్ని ఎంపిక చేసుకోవాలి. ఆలా నడవటం లేదు తెలుగు సినిమా పరిశ్రమలో. కాంబినేషన్స్ కోసం ఎదురు చూస్తూ, కథ లేకపోయినా, ఎదో ఒకటి చేసెయ్యాలి అన్న తలంపుతో, సినిమాలు చేస్తే ఎక్కడ నడుస్తాయి. తెలుగు పరిశ్రమ దర్శకుల, నిర్మాతల ఆలోచన సరళి మారాలి, డబ్బులు, పెద్ద బడ్జెట్ లు, స్టార్స్ కాదు, కథలు ఎంపికలో ముందు తల దూర్చండి, తరువాత దాన్ని బట్టి నటుల్ని ఎంపిక చేసుకోండి. ఎక్కడెక్కడి వల్లనో తెచ్చి ఇక్కడ రుద్దకండి, ఇక్కడి వాళ్ళని దేశానికీ ఇతర ప్రాంతాలకి పరిచయం చెయ్యండి. వేరే బాషల నుండి ఇంతమంది సాంకేతిక నిపుణులు  తయారవుతున్నారు,మరి తెలుగు నుండి ఇప్పుడు ఎవరూ రావటం లేదు ఎందుకు? ఆలోచించండి. ఇక్కడ కూడా 'కాంతారా' లాంటి సినిమాలు రావాలి. 


మరి తెలుగు ఫిలిం మేకర్స్ ఎందుకు ఆలా చెయ్యటం లేదు. పాన్ ఇండియా పేరు చెప్పి, పెద్ద దర్శకులు కూడా హీరోల వెనకాల తిరుగుతూ హీరో డేట్స్ కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారో అర్థం కాదు. ఒక్క రాజమౌళి తప్పితే, ఎందుకంటే అతనొక్కడే తెలుగు సినిమాని అంతర్జాతీయంగా తీసుకెళుతున్నాడు, మిగతా ఎవరూ సొంత కథలు తీయడానికి ఎందుకు రావటం లేదు. కథ రాయటానికి బ్యాంకాక్ బీచ్ కొ, గోవా కో, లేదా థాయిలాండ్, స్విట్జర్లాండ్ లాంటి దేశాలకో వెళ్లనవసరం లేదు, మీ స్వంత వూరు వెళితే చాలు, చాలా కథలు పుట్టుకొస్తాయి. మీ చుట్టు పక్కల వున్నాయి చాలా కథలు, అవి చెప్పండి, చూపించండి. పాన్ ఇండియా లెవెల్ లో ఆలోచన చేయకండి ముందు, ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయలే చెప్పండి, అంతర్జాతీయంగా తీసుకెళ్లండి. వాళ్ళకి నచ్చుతుంది. 

ఇంకో విషయం కూడా, తెలుగు నటులని హీనంగా చూస్తూ, కామెంట్ చేస్తూ, తెలుగు నటులకి అవకాశం ఇవ్వకుండా, భాష రాని వాళ్ళని తెచ్చి బలవంతంగా వాళ్ళతో నటింప చేసి, తెలుగు వాళ్ళకన్నా వాళ్ళకి ఎక్కువ పారితోషికం ఇచ్చి, నెత్తిమీదకి ఎక్కించుకొని చేయిస్తే అందులో నేటివిటీ ఎక్కడ వుంటుంది. 'కాంతార' చూడండి, చూసి నేర్చుకోవాల్సింది ఎంతయినా వుంది. వేరే బాషా నటుల్ని చులకన చెయ్యడం కోసం కాదు ఈ మాట చెప్పేది, ముందు తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెపుతున్నాను. 

దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ కథానాయకుడిగా  తీసిన 'పుష్ప' (Pushpa) అందుకు వుదాహరణ. అది అంతర్జాతీయంగా విజయం సాధించటానికి మారేడుమిల్లి (Maredumilli) అడవిలో జరిగే కథని సుకుమార్ భారతదేశానికి చూపించాడు. అందుకే అందరికీ నచ్చింది. అందులో పర బాషా నటులు కూడా ఎవరూ లేరు. అందుకే సినిమా కూడా అంతా నేచురల్ గా వచ్చింది. ఇప్పుడు పార్ట్ 2 వస్తోంది. దానికి ఎక్కడెక్కడి నటుల్ని తీసుకోవాలని అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. మొదట అనుకున్న కథ కాకుండా, మారుస్తున్నారని కూడా వింటున్నాం. మరి సుకుమార్ ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కావటం లేదు. ఇక్కడి కధనే ఇక్కడి వాళ్ళతో అక్కడ చూపించండి. వాళ్ళకి కొత్తగా వుంటుంది. వాళ్ళు రోజూ చూస్తున్న నటుల్ని తెచ్చి ఇక్కడి తెలుగు సినిమాలో పెట్టి మళ్ళీ అక్కడి వాళ్ళకి చూపిస్తే, వాళ్ళకి బోర్ కొడుతుంది. 


Updated Date - 2022-10-19T19:21:56+05:30 IST