Nene Vastunna: రక్కసుడొక్కడు లేకుంటే.. దేవుని విలువే తెలియదులే..!
ABN, First Publish Date - 2022-09-26T05:36:07+05:30
తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటించిన ‘నానే వరువెన్’ చిత్రం.. తెలుగులో ‘నేనే వస్తున్నా’ (Nene Vastunna) టైటిల్తో విడుదలవుతున్న విషయం
తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటించిన ‘నానే వరువెన్’ చిత్రం.. తెలుగులో ‘నేనే వస్తున్నా’ (Nene Vastunna) టైటిల్తో విడుదలవుతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ (Geetha Arts) బ్యానర్పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) విడుదల చేస్తున్నారు. ధనుష్ సోదరుడు, వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు సెల్వరాఘవన్ (Selva Raghavan) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ను మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. రోజుకో కొత్త అప్డేట్ అన్నట్లుగా ఇప్పటికే పోస్టర్స్, టీజర్స్ వదిలిన మేకర్స్.. తాజాగా చిత్రంలోని ‘ఒకే ఒక ఊరిలోనా రాజులేమో ఇద్దరంట’ (Oke Oka Oorilona Rajulemo Iddaranta) అనే లిరికల్ సాంగ్ను విడుదల చేశారు.
‘‘ఒకే ఒక ఊరిలోన.. రాజులేమో ఇద్దరంట
ఒక్కడేమో మంచోడంట.. ఇంకొకడేమో చెడ్డోడంట
చిక్కని చీకటి లేకుంటే.. చంద్రుని వెలుగే తెలియదులే..
రక్కసుడొక్కడు లేకుంటే.. దేవుని విలువే తెలియదులే..
పాముల్లోనా విషముంది, పువ్వుల్లోనూ విషముంది
పూలను తల్లో పెడతారే.. పామును చూస్తే కొడతారే
మనిషిలో మృగమే దాగుందే, మృగములో మానవతుంటుందే..
మృగముకు ప్రాణం ఇస్తున్నా.. మనిషిలో ప్రాణం తీస్తున్నా..
చిక్కని చీకటి లేకుంటే.. చంద్రుని వెలుగే తెలియదులే..
రక్కసుడొక్కడు లేకుంటే.. దేవుని విలువే తెలియదులే..’’ అంటూ సాగిన ఈ పాట.. సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్న ధనుష్లోని రెండు విభిన్నకోణాలని ఆవిష్కరించడమే కాకుండా, సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. చంద్రబోస్ రాసిన ఈ పాటను ఎస్.పి.అభిషేక్, దీపక్ బ్లూ ఆలపించారు. యువన్ శంకర్ రాజా బాణీలను సమకూర్చారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్లో టాప్లో ట్రెండ్ అవుతోంది. వి క్రియేషన్స్ బ్యానర్పై కలైపులి ఎస్ థాను (Kalaippuli S Thanu) నిర్మించిన ఈ చిత్రంలో ఎల్లి అవ్రామ్, ఇందుజా రవిచంద్రన్, యోగిబాబు తదితరులు ఇతర పాత్రలలో నటించారు.