తెలుగులో లత మధుర గానం
ABN, First Publish Date - 2022-02-06T16:44:59+05:30
తెలుగులో లత మధుర గానం.. అది స్వరం కాదు మన పాలిట వరం...అని భారతీయులందరూ గర్వంగా చెప్పుకునే సంగీత సరస్వతి లతా మంగేష్కర్. తను ఒక మంచి గాయనిగా పేరు తెచ్చుకోవడానికి ఆమె చేసిన కృషి అంతా ఇంతా కాదు.
అది స్వరం కాదు మన పాలిట వరం...అని భారతీయులందరూ గర్వంగా చెప్పుకునే సంగీత సరస్వతి లతా మంగేష్కర్. తను ఒక మంచి గాయనిగా పేరు తెచ్చుకోవడానికి ఆమె చేసిన కృషి అంతా ఇంతా కాదు. ప్రతి రోజూ గంటల తరబడి సంగీత సాధన చేసేవారు. కంఠాన్ని క్రమ పద్దతిలో పెట్టుకునేవారు. జీవితంలో కూడా ఎంతో క్రమశిక్షణతో మెలిగేవారు. తను హిందీ పాటలతో బిజీగా ఉన్నప్పటికీ తెలుగులో కూడా పాడాలనే కోరిక ఆమెకు ఉండేది. 1953 లో విడుదల అయిన 'ప్రేమలేఖలు' చిత్రంలో లత పాటలు పాడారు. రాజ్ కపూర్ హిందీ చిత్రం 'ఆహ్' కు ఇది సెమీ డబ్బింగ్. ఈ చిత్రంలోని పాటలన్నీ ఆరుద్ర రాశారు. సంగీత దర్శక ద్వయం శంకర్ - జై కిషన్ 'ప్రేమ లేఖలు' చిత్రంలో లతతో పాటలు పాడించాలనుకున్నారు. ఆమె కూడా వుత్సాహం చూపించారు. కానీ ఆరోగ్యం సహకరించక పోవడంతో ఆ ఛాన్స్ మిస్ అయింది.
ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన 'సంతానం' చిత్రంలో సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి లత తో తొలిసారిగా పాట పాడించారు. అనిశెట్టి 'నిదుర పోరా తమ్ముడా' అంటూ రాసిన జోల పాటను లత పాడగా.. 1955, జనవరి 4 న రేవతి స్టూడియోలో రికార్డ్ చేశారు. బాలనటి విజయలక్ష్మి పై ఈ పాట చిత్రీకరించారు.
ఆ తర్వాత లత తో మరికొన్ని తెలుగు పాటలు పాడించాలని ప్రయత్నించినా హిందీ పాటలతో ఆమె బిజీగా ఉండడంతో సాధ్యం కాలేదు. చివరికి నిర్మాత అశ్వనీదత్ సాధించారు. నాగార్జున హీరోగా నటించిన 'ఆఖరి పోరాటం' చిత్రం కోసం ఆమె ను ఎలాగోలా ఒప్పించి ఓ పాట పాడించారు. వేటూరి రాసిన 'తెల్ల చీరకు' పాటను బాలుతో కలసి పాడారు లత. ఇళయరాజా సంగీత దర్శకుడు. నాగార్జున, శ్రీదేవి పై ఈ పాట చిత్రీకరించారు. లత తెలుగులో పాడిన రెండు చిత్రాల్లో తండ్రీ కొడుకులు అక్కినేని, నాగార్జున హీరోలు కావడం విశేషం గా చెప్పాలి.
వినాయకరావు