Ks ramarao: ఆ నలుగురిని మెప్పిస్తేనే సినిమా మనుగడ!
ABN, First Publish Date - 2022-06-20T01:22:26+05:30
‘తెలుగు చిత్ర పరిశ్రమను శాసించేది ఆ నలుగురు మాత్రమే’.. చాలా సంవత్సరాలుగా వినిపిస్తున్న మాట ఇది. అయితే ‘ఆ నలుగురు’ అని చెప్పడమే తప్ప వారెవరూ అనేది ప్రత్యక్షంగా బయటపెట్టినవాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు. తాజాగా నూతన నటీనటులుతో తెరకెక్కనున్న ‘ఐక్యూ’ చిత్రం ప్రారంభోత్సవ వేడుకలో సీనియర్ నిర్మాత కే.ఎస్.రామారావు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు.
‘తెలుగు చిత్ర పరిశ్రమను శాసించేది ఆ నలుగురు మాత్రమే’.. చాలా సంవత్సరాలుగా వినిపిస్తున్న మాట ఇది. అయితే ‘ఆ నలుగురు’ అని చెప్పడమే తప్ప వారెవరూ అనేది ప్రత్యక్షంగా బయటపెట్టిన వాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు. తాజాగా నూతన నటీనటులుతో తెరకెక్కనున్న ‘ఐక్యూ’ చిత్రం ప్రారంభోత్సవ వేడుకలో సీనియర్ నిర్మాత కే.ఎస్.రామారావు (K s ramarao) ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. పరిశ్రమలో ఆరితేరిన నిర్మాతగా కొత్త నిర్మాతలకు పలు సూచనలు ఇచ్చారాయన. ఓ సినిమా తెరపై కనబడాలన్నా.. జనాల ఆదరణ పొందాలన్నా మొదట ఆ నలుగురిని మెప్పించాలనీ, లేని పక్షంలో సినిమాకు మోక్షం లభించదని దిల్ రాజు, అల్లు అరవింద్, సునీల్ నారంగ్, సురేశ్ బాబు పేర్లను ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (Dil raju)
ఇక విషయంలోకి వెళ్తే. క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ అధినేత శనివారం ‘ఐక్యూ’ చిత్రం పూజా కార్యక్రమాలకు అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై చిన్న సినిమా మనుగడ గురించి ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే బాధ కలుగుతుందన్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న చిత్రాలు ఎక్కువ మొత్తంలోనే తీస్తున్నారు. కానీ ఆదరణ మాత్రం ఆశించిన రీతిలో లేదు. కథ ఎంత గొప్పదైనా, ఎంత బడ్జెట్ పెట్టినా ఈ రోజుల్లో సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం చాలా ముఖ్యం. సినిమాకు పెట్టిన బడ్జెట్ కన్నా ప్రమోషన్ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంది. ‘ఐక్యూ’ టైటిల్ నేటి యువతకు కనెక్ట్ అవుతుంది. కానీ పాతతరం వారికి అంతగా అర్ధం కాదు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటే చాలా కష్టపడాలి. అంతకన్నా ముందు ఈ చిత్రం ప్రజల్ని మెప్పించాలంటే మొదట ఆ నలుగురిని మెప్పించాలి. వారే అల్లు అరవింద్, దిల్ రాజు, సునీల్ నారంగ్, డి.సురేశ్బాబు. వీరిని మెప్పిస్తేనే సినిమా తెరపై కనిపిస్తుంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడాలంటే కచ్చితంగా ఆ నలుగురు పూనుకోవాలి. కాబట్టి ఆ నలుగురు మెచ్చుకునే విధంగా ఈ చిత్రం ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో ఉంది సినిమా ఇండస్ట్రీ. అందుకే ఆ నలుగురు, ఐదుగురు హీరోలతోనే సినిమాలు తీయాల్సి వస్తుంది. నలుగురు దర్శకుల చుట్టూనే తిరగాల్సి వస్తుంది. వారు చెప్పిన బడ్జెట్తోనే సినిమాలు తీయాల్సి ఉంటుంది. అయితే ఆ భారమంతా ప్రేక్షకుల మీద పడుతుంది. అందుకే ప్రజలు ఆ బడ్జెట్ను తిరస్కరిస్తున్నారు. టికెట్ ధరలు తట్టుకోలేక పదిరోజుల తర్వాత ఓటీటీలో చూద్దాం అన్న ఆలోచనకు వస్తున్నారు. ఇదే జరిగితే థియేటర్ల మనుగడ చాలా కష్టం. ఒకప్పుడు టీవీ ఒక్కటే సినిమాకు విరోధి, ఇప్పుడు ఓటీటీకూడా విరోధిగా మారింది. ఓటీటీ రావడానికి కూడా దర్శకనిర్మాతలే కారణం. ఈ విధానం మారాలి’’ అని కే.ఎస్.రామారావు అన్నారు. (TFI)