చిరునవ్వుతోనే అందరి హృదయాలు గెలిచారు
ABN , First Publish Date - 2022-11-02T10:10:18+05:30 IST
చిరునవ్వుతోనే అందరి హృదయాలను గెలిచిన మహోన్నత వ్యక్తిత్వం డాక్టర్ పునీత్ సొంతమని ఎన్టీఆర్ కొనియాడారు. బెంగళూరు విధానసౌధ ప్రాంగణంలో...
చిరునవ్వుతోనే అందరి హృదయాలను గెలిచిన మహోన్నత వ్యక్తిత్వం డాక్టర్ పునీత్ సొంతమని ఎన్టీఆర్ కొనియాడారు. బెంగళూరు విధానసౌధ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం ప్రముఖ నటుడు పునీత్కు మరణానంతరం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ‘కర్ణాటక రత్న’ పురస్కారాన్ని ప్రదానం చేసింది. వర్షం పడుతున్నా లెక్కచేయకుండా వేలాది మంది అభిమానులు ఈ కార్యక్రమాన్ని తిలకించి పులకించారు. ఎన్టీఆర్ కన్నడభాషలో ప్రసంగిస్తూ పునీత్రాజ్కుమార్ తనకు గొప్ప స్నేహితుడని అన్నారు. ఆ స్నేహం కోసమే ఇంతదూరం వచ్చానని తెలిపారు. అభిమానులంతా గర్వపడేలా చక్కటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడం ఆయన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. రాజ్కుమార్ కుటుంబీకులంతా తనను కూడా కుటుంబ సభ్యుడిగా చూస్తారని తెలిపారు.. సూపర్స్టార్ రజనీకాంత్ ప్రసంగిస్తూ, బాలనటుడిగా ఉన్నప్పటి నుంచి పునీత్ తనకు తెలుసని పేర్కొన్నారు. చిన్న వయసులోనే అసమాన ప్రతిభా పాటవాలు కనబరిచి, ఇంతలోనే మాయమయ్యాడని ఉద్వేగానికి లోనయ్యారు. కర్ణాటక రత్న పురస్కారాన్ని పునీత్ సతీమణి అశ్విని అందుకున్నారు. పునీత్ సోదరులైన శివరాజ్కుమార్, రాఘవేంద్ర రాజ్కుమార్తోపాటు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి తదితరులు వేదికను అలంకరించారు.
బెంగళూరు (ఆంధ్రజ్యోతి)