టైటిల్కి తగ్గట్టే ఇది పక్కా కమర్షియల్
ABN , First Publish Date - 2022-06-04T05:49:06+05:30 IST
‘‘రణం, లౌక్యం తరవాత.. సినిమా అంతా వినోదం పంచే పాత్ర నాకు దొరకలేదు. ‘పక్కా కమర్షియల్’తో..
‘‘రణం, లౌక్యం తరవాత.. సినిమా అంతా వినోదం పంచే పాత్ర నాకు దొరకలేదు. ‘పక్కా కమర్షియల్’తో ఆ అవకాశం నాకు వచ్చింద’’న్నారు గోపీచంద్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. మారుతి దర్శకుడు. రాశీఖన్నా కథానాయిక. గీతా ఆర్ట్స్ 2, యూవీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. జులై 1న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గోపీచంద్ మాట్లాడుతూ ‘‘టైటిల్కి తగట్టుగానే పక్కా కమర్షియల్ సినిమా ఇది. మారుతి రాసుకొన్న కథలోనే కావల్సినంత ఫన్ ఉంది. తను రాసుకొన్న పాత్రకు పూర్తి న్యాయం చేశాననిపిస్తోంది. టీమ్ వర్క్తో చేసిన సినిమా ఇది. అల్లు అరవింద్ గారి తో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఆ అవకాశం ఇప్పుడు దక్కింది. రాశీ చాలా ప్రతిభావంతురాలు. తనకు మంచి పాత్ర లభించింద’’న్నారు. మారుతి మాట్లాడుతూ ‘‘ప్రతీ సినిమాకీ బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. కానీ ఈ సినిమాకి మాత్రం గేట్లు ఎత్తేశాను. బాగా ఖర్చు పెట్టించి తీసిన సినిమా ఇది. నా నుంచి ఆశించే వినోదం, గోపీచంద్ అభిమానులు ఇష్టపడే యాక్షన్ పుష్కలంగా ఉంటాయ’’న్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘‘గోపీచంద్లో కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. అది ఈ సినిమాతో అర్థమవుతుంది. గోపీ తండ్రి టి.కృష్ణతో గీతా ఆర్ట్స్లో ఓ సినిమా చేద్దామనుకొన్నా. కానీ కుదర్లేదు. ఇంతకాలానికి గోపీతో సినిమా చేయడం ఆనందంగా ఉంద’’న్నారు.