KVR Mahendra: క్రైం థ్రిల్లర్గా ‘దొరసాని’ దర్శకుడి రెండో చిత్రం
ABN, First Publish Date - 2022-10-04T03:18:19+05:30
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), శివాత్మిక రాజశేఖర్ (Shivathmika Rajashekar)లను ‘దొరసాని’ (Dorasani) చిత్రంతో వెండితెరకు పరిచయం
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), శివాత్మిక రాజశేఖర్ (Shivathmika Rajashekar)లను ‘దొరసాని’ (Dorasani) చిత్రంతో వెండితెరకు పరిచయం చేయడమే కాకుండా.. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును పొందాడు దర్శకుడు కెవిఆర్. మహేంద్ర (KVR Mahendra). ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే అందులో నటించిన నటీనటులకు కూడా మంచి పేరును తెచ్చిపెట్టింది. అయితే ఆ సినిమా వచ్చి చాలా కాలం అవుతున్నా.. దర్శకుడు తన రెండో సినిమా ఏమిటనేది ఇంత వరకు వెల్లడించలేదు. తాజాగా అతని రెండో సినిమాకు సంబంధించిన వివరాలు తెలిశాయి. ఈసారి క్రైం థిల్లర్ నేపథ్యంలో సినిమాను చేసేందుకు ఆయన సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.
మొదటి సినిమాతో ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్లను ఎలా అయితే పరిచయం చేశాడో.. ఇప్పుడు చేయబోతున్న రెండవ చిత్రంతో కూడా కూడా దర్శకుడు కెవిఆర్.మహేంద్ర నూతన నటీనటులనే పరిచయం చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సినిమాలో నటించే నటీనటులకు సంబంధించి ఆడిషన్స్ జరుగుతున్నాయి. తొలి చిత్రానికి ప్రేమకథని ఎన్నుకుని.. తనదైన శైలిలో తెరకెక్కించిన కెవిఆర్.మహేంద్ర.. ఈసారి ఒక క్రైం థ్రిల్లర్ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.