‘టైగర్ నాగేశ్వరరావు’ కథను ముందు నాకే చెప్పారు: చిరంజీవి
ABN , First Publish Date - 2022-04-03T01:11:32+05:30 IST
‘టైగర్ నాగేశ్వరరావు’ కథను పాండమిక్ సమయంలో దర్శకుడు వంశీ నాకు కథ వినిపించారు. చాలా అద్భుతంగా నెరేట్ చేశారు. ఆ తర్వాత నాకు సాధ్యపడలేదు..’’ అని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న
‘‘ ‘టైగర్ నాగేశ్వరరావు’ కథను పాండమిక్ సమయంలో దర్శకుడు వంశీ నాకు కథ వినిపించారు. చాలా అద్భుతంగా నెరేట్ చేశారు. ఆ తర్వాత నాకు సాధ్యపడలేదు..’’ అని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం శనివారం శుభకృతు నామ సంవత్సరం ఆరంభమైన ఉగాది పర్వదినాన హైదరాబాద్లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. పూజా కార్యక్రమాలు అనంతరం హీరో రవితేజ, హీరోయిన్లు నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టారు. తేజ్ నారాయణ అగర్వాల్ కెమెరా స్విచ్చాన్ చేయగా.. మంత్రి కిషన్ రెడ్డి స్క్రిప్ట్ని చిత్రయూనిట్కి అందజేశారు. ‘ద కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర ప్రీలుక్ మోషన్ పోస్టర్ను చిరంజీవి ఆవిష్కరించారు.
అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘శుభకృతు నామ సంవత్సరంలో అందరికీ శుభాలు జరగాలి. టైగర్ నాగేశ్వరరావు కథను పాండమిక్ సమయంలో దర్శకుడు వంశీ నాకు కథ వినిపించారు. చాలా అద్భుతంగా నెరేట్ చేశారు. ఆ తర్వాత నాకు సాధ్యపడలేదు. ఇప్పుడు నా తమ్ముడు రవితేజ చేయడం చాలా సంతోషంగా వుంది. ఈ స్టూవర్ట్పురం నాగేశ్వరరావు గురించి నేను చిన్నప్పుడే విన్నాను. మా నాన్నగారు చీరాల-పేరాలలో ఉద్యోగం చేస్తుండేవారు. ఆ పక్కనే స్టూవర్ట్పురం ఉండేది. అక్కడి వారంతా నాగేశ్వరరావుని హీరోగా కొనియాడుతుండేవారు. ఆసక్తితో నాన్నగారి నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇన్నాళ్ళ తర్వాత ఆయన కథని వంశీ కమర్షియల్ తీర్చిదిద్దారు. తమ్ముడు రవితేజ ఈ సినిమా చేయడం శుభం. అందుకు అభిషేక్ అగర్వాల్ పూనుకోవడం చాలా ఆనందంగా వుంది. ఇటీవలే వారు ‘ద కశ్మీర్ ఫైల్స్’తో సక్సెస్ మూడ్లో ఉన్నారు. కొత్త సంవత్సరంలో పూర్తయిన ఈ చిత్రం త్వరగా విడుదలై ‘ద కశ్మీర్ ఫైల్స్’ ఎంత పెద్ద హిట్టయిందో అంతకంటే హిట్ అయి రవితేజకు, అభిషేక్కు, వంశీకి మంచి జరగాలని కోరుకుంటున్నాను..’’ అని అన్నారు. చిత్ర హీరో రవితేజ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలపగా.. ఈ అవకాశం పట్ల హీరోయిన్లు సంతోషం వ్యక్తం చేశారు.