Shah Rukh, Salman ఉన్నంత కాలం.. బాలీవుడ్ మునిగిపోతూనే ఉంటుందంటూ.. Vivek Agnihotri కామెంట్స్
ABN , First Publish Date - 2022-07-15T19:19:11+05:30 IST
బాలీవుడ్ చిత్ర పరిశ్రమతోపాటు సెలబ్రిటీలు సైతం ఎక్కువ, తక్కువ స్థాయిలను చూశారు. ముఖ్యంగా.. కోవిడ్-19 కారణంగా...
బాలీవుడ్ చిత్ర పరిశ్రమతోపాటు సెలబ్రిటీలు సైతం ఎక్కువ, తక్కువ స్థాయిలను చూశారు. ముఖ్యంగా.. కోవిడ్-19 కారణంగా దాదాపు రెండేళ్లు ఇండస్ట్రీ మొత్తం క్లోజ్ అయ్యింది. ఈ తరుణంలో ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. దీంతో హిందీ ప్రేక్షకులు చాలా బాలీవుడ్ మూవీలను తిరస్కరించారు. అదే సమయంలో.. ఊర మాస్గా ఉన్న దక్షిణాది సినిమాలను మాత్రం బాగా ఆదరించారు. కరెక్టుగా చెప్పాలంటే.. బాలీవుడ్ మూవీస్ కంటే దక్షిణాది డబ్బింగ్ వెర్షన్లే అక్కడ ఎక్కువ కలెక్షన్లని కొల్లగొట్టాయి. ఈ తరుణంలో హిందీ సినిమాలపై, అక్కడ స్టార్స్పై విమర్శలు సైతం వచ్చాయి.
ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ కొట్టిన చిత్రం ‘కాశ్మీర్ ఫైల్స్’. ఆ సినిమాతో డెరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri)కి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఈ దర్శకుడు తాజాగా బాలీవుడ్ బాద్షా, కింగ్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), సుల్తాన్ సల్మాన్ ఖాన్ (Salman Khan)పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశాడు. వివేక్ చేసిన ట్వీట్లో.. ‘కింగ్స్, బాద్షాలు, సుల్తాన్లు ఉన్నంతకాలం బాలీవుడ్ మునిగిపోతూనే ఉంటుంది. మీరు ప్రజల కథలతో సినిమాలు తీస్తూ.. ప్రజల పరిశ్రమగా మార్చాలి.. అది మాత్రమే ప్రపంచ చలనచిత్ర పరిశ్రమను ముందుకు తీసుకెళుతుంది. ఇది వాస్తవం’ అంటూ పరోక్షంగా కింగ్ ఖాన్, సల్మాన్ మీద విమర్శలు చేశాడు.
కాగా.. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం కత్రినా కైఫ్తో కలిసి ‘టైగర్ 3’లో నటిస్తున్నాడు. పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్తో కలిసి ‘కబీ ఈద్ కబీ దివాళి’ అనే సినిమా చేస్తున్నాడు. అందులో టాలీవుడ్ హీరో వెంకటేశ్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. అలాగే.. చాలా గ్యాప్ తర్వాత షారుఖ్ ఖాన్ సైతం ‘జవాన్’, ‘పఠాన్’, ‘డుంకీ’ వంటి వరుస చిత్రాలతో ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు.