షారూఖ్ పరువును మంటగలిపేందుకు ప్రయత్నించారు: సౌతిండియన్ హీరో
ABN , First Publish Date - 2022-03-05T21:26:15+05:30 IST
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన సంగతి తెలిసిందే. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు రేవ్ పార్టీ జరుగుతున్న క్రూయిజ్ షిప్పై దాడి చేసి ఆర్యన్ను అరెస్టు చేశారు. కింగ్ ఖాన్ కొడుకు ఈ కేసులో చిక్కుకోవడంతో షారూఖ్ పేరు దేశమంతా మార్మోగిపోయింది. పలువురు బాలీవుడ్ సెలబ్రెటీలు డ్రగ్స్ కేసులో షారూఖ్కు మద్దతుగా నిలిచారు. అందరూ ఈ ఘటనను మరచిపోతున్న వేళ ఓ సౌతిండియన్ హీరో ఈ కేసుపై మాట్లాడారు.
‘మిన్నల్ మురళి’లో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైన నటుడు టోవినో థామస్. తాజాగా ఆయన మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకున్నారు. ఆర్యన్ ఖాన్ కేసుపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘‘కొంతమంది రాజకీయ కారణాలతో షారూఖ్ ఖాన్ పరువును మంటగలిపేందుకు ప్రయత్నించారు. అందువల్లే ఆర్యన్ను ఈ కేసులో ఇరిక్కించారు’’ అని టోవినో చెప్పారు.
కొన్నిరోజుల క్రితం ఆర్యన్ ఖాన్కు ఎన్సీబీ నుంచి క్లీన్ చిట్ లభించిందని పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై ఎన్సీబీ చీఫ్ సంజయ్ సింగ్ స్పందించారు. ‘‘ఆర్యన్కు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాధారాలు లభించలేదనడం నిజం కాదు. అవన్నీ పుకార్లు మాత్రమే. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలోనే ఉంది. సిట్ బృందం పలువురి స్టేట్ మేంట్స్ను రికార్డ్ చేసింది. ఇంకా ఎటువంటి నిర్ధారణకు రాలేదు’’ అని సంజయ్ పేర్కొన్నారు.