Janhvi Kapoor: జూనియర్ శ్రీదేవిని ఆడేసుకుంటున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-25T16:15:17+05:30 IST

అందాల తార, దివంగత నటి శ్రీదేవి, వ్యాపారవేత్త బోనీ కపూర్ వారసురాలిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నటి జాన్వీ కపూర్

Janhvi Kapoor: జూనియర్ శ్రీదేవిని ఆడేసుకుంటున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..

అందాల తార, దివంగత నటి శ్రీదేవి, వ్యాపారవేత్త బోనీ కపూర్ వారసురాలిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor). వరుసగా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది. సినిమాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలను చేస్తున్న ఈ భామ అందంతోపాటు అభినయంతోనూ అభిమానులను అలరిస్తోంది. అందుకే ఈ బ్యూటీని అభిమానులు ప్రేమగా జూనియర్ శ్రీదేవి (Sridevi) అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ భామ తాజాగా నటించిన చిత్రం ‘గుడ్ లక్ జెర్రీ(Goodluck Jerry)’. సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanatara) నటించిన ‘కోలమావు కోకిల (తెలుగులో కో కో కోకిల)’ మూవీకి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలో విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో చిత్రబృందం బిజీగా ఉంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ పలు ఆసక్తికర విషయాల గురించి మాట్లాడి ట్రోలింగ్‌కి గురైంది.


జాన్వీ మాట్లాడుతూ.. ‘స్కూల్‌లో ఉన్నప్పుడు నాకు హిస్టరీ అంటే చాలా ఇష్టం. గణితం అంటే అస్సలు ఇష్టం లేదు. నాకో విషయం అర్థం కాదు. అదేంటంటే.. కాలిక్యులేటర్ కనిపెట్టిన తర్వాత లెక్కలు చేయడం చాలా సులువైపోయింది. ఇంకా కష్టపడి ఆల్జీబ్రాను నేర్చుకోవడంలో ఉపయోగం ఏ ఉంది. మ్యాథ్స్ కోసం ఎందుకు అంతలా తలలు బద్దలుకొట్టుకుంటారో అర్థంకాదు. అయితే.. చరిత్ర, సాహిత్యం జనాల్ని సంస్కారవంతమైన మనుషులుగా చేస్తాయి. గణితం మిమ్మల్ని నెమ్మదించేలా చేస్తుంది’ అని గణితంపై కామెంట్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో జాన్వీ కామెంట్స్ నచ్చని కొందరు నెటిజన్లు ఈ భామని ట్రోల్ చేయడం ప్రారంభించారు.


‘కాలిక్యులేటర్ ద్వారా ఆల్జీబ్రాని చేసేందుకు జాన్వీ కపూర్ ప్రయత్నిస్తోంది. ఇక్కడ లాజిక్ చచ్చిపోయింది. ముందుకు సాగండి.. ఇంకా ఇలాంటి చాలా చూడాలి’ అని ఓ నెటిజన్.. ‘లక్షల ఫీజులు కట్టి ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదివిన వారి నాలెడ్జ్ ఎలా ఉంటుందనే దానికి రుజువు ఇదే’ అని ఒకరు.. ‘మీరు ఉన్న దయనీయ స్థితికి గణితాన్ని ఎందుకు నిందిస్తారు?’ అని ఇంకొకరు కామెంట్ చేశారు. కాగా.. జాన్వీ మూవీ ‘గుడ్‌లక్ జెర్రీ’ జూలై 29న డైరెక్ట్‌‌గా ఓ ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది.అలాగే, రాజ్‌కుమార్ రావుతో కలిసి ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’లో నటిస్తోంది.



Updated Date - 2022-07-25T16:15:17+05:30 IST