‘బాహుబలి’ బాటలోనే భారీ సినిమాలన్నీ.. అవసరమంటోన్న ఫిల్మ్ మేకర్స్..

ABN , First Publish Date - 2022-04-08T02:09:07+05:30 IST

బాక్సాఫీస్ వద్ద హిట్ అయిన సినిమాలు సీక్వెల్‌గా మొదలై ప్రాంచైజీలుగా మారడం

‘బాహుబలి’ బాటలోనే భారీ సినిమాలన్నీ.. అవసరమంటోన్న ఫిల్మ్ మేకర్స్..

బాక్సాఫీస్ వద్ద హిట్ అయిన సినిమాలు సీక్వెల్‌గా మొదలై ప్రాంచైజీలుగా మారడం కొత్తేమీ కాదు. ‘క్రిష్’, ‘హౌస్‌ఫుల్’, ‘సర్కార్’తో సహా మరెన్నో చిత్రాలు ఈ విధంగా తెరకెక్కినవే. నేటి ఫిల్మ్ మేకర్స్ మాత్రం కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. సినిమా విడుదలకు ముందే పలు భాగాలుగా విడుదల చేస్తామని ప్రకటిస్తున్నారు. కథను సమర్థంగా, సవివరంగా చెప్పాలంటే రెండు, మూడు భాగాలు అవసరమని చెబుతున్నారు. 


బాలీవుడ్ హ్యాండ్సమ్ స్టార్ రణ్‌బీర్ కపూర్-అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’. ఈ చిత్రం గత కొన్నేళ్లుగా చిత్రీకరణ జరుపుకొంటుంది. పురాణాలను ఆధారంగా చేసుకుని ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. అయితే, ‘బ్రహ్మాస్త్ర’ను త్రీ పార్ట్స్‌గా నిర్మిస్తామని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. కథను పూర్తిగా చెప్పాలంటే మూడు భాగాలు అవసరమన్నారు. తమకు కథ మీద నమ్మకం ఉండటంతోనే భారీ బడ్జెట్‌తో కనివినీ ఎరుగని స్థాయిలో రూపొందిస్తున్నామన్నారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాను మేకర్స్ విడుదలకు ముందే రెండు భాగాలుగా విడుదల చేస్తామని ప్రకటించారు. మొదటి భాగం బాలీవుడ్‌లో భారీస్థాయిలో విజయం సాధించింది. దీంతో రెండో భాగంపై మంచి బజ్ ఏర్పడింది.  


దర్శకధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ సినిమాతో ఈ ట్రెండ్‌ని ప్రారంభించాడు. ‘బాహుబలి’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాయి. మొదటి పార్ట్ కంటే రెండోది అత్యధిక స్థాయిలో కలెక్షన్లను కొల్లగొట్టింది. కథ బాగుండటంతోనే ఇది సాధ్యమైంది. అందువల్లే భారీ స్థాయిలో నిర్మించే ప్రాజెక్టులన్నింటిని వీలైనన్ని భాగాలుగా ప్రజల ముందుకు తీసుకువస్తున్నారు. ఒకవేళ మొదటి భాగం పరాజయం పాలైతే రెండో భాగానికి అంతగా వసూళ్లు రావు. విజయం సాధిస్తే మాత్రం రెండో పార్ట్‌కు బడ్జెట్‌ను పెంచి వీలైనంత మేర ప్రమోషన్లను చేస్తున్నారు.

Updated Date - 2022-04-08T02:09:07+05:30 IST