అలియా, రణ్బీర్ పెళ్లికి అతిథులుగా ఎంత మంది హాజరు కానున్నారంటే
ABN , First Publish Date - 2022-04-12T00:06:58+05:30 IST
సెలబ్రిటీ లవ్ బర్డ్స్ అలియా భట్, రణ్బీర్ కపూర్ పెళ్లి చేసుకోబోతున్నారు.
సెలబ్రిటీ లవ్ బర్డ్స్ అలియా భట్, రణ్బీర్ కపూర్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఏప్రిల్ 14న భార్యాభర్తలుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ జంట పెళ్లి వేడుకలు ఏప్రిల్ 13న మొదలు కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ వేడుకకు అతి కొద్దిమంది మాత్రమే హాజరు కాబోతున్నట్టు సమాచారం.
అలియా భట్, రణ్బీర్ కపూర్ల పెళ్లి అత్యంత సన్నిహితుల సమక్షంలో జరగబోతున్నట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. అలియా భట్ సోదరుడు రాహుల్ భట్ ఈ పెళ్లికి సంబంధించిన విషయాలను తెలిపాడు. ఈ వేడుకకు దాదాపుగా 28మంది మాత్రమే అతిథులుగా హాజరుకానున్నారని చెప్పాడు. ఈ జంట ముంబై, చెంబూరులోని ‘ఆర్కే హౌస్’లో పెళ్లి చేసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు కొట్టాయి. కానీ, ఈ లవ్ బర్డ్స్ రణ్బీర్ కపూర్ నివాసమైన ‘వాస్తు’లో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడంతోనే పెళ్లి జరిగే ప్రదేశాన్ని ‘ఆర్కేహౌస్’ నుంచి ‘వాస్తు’ కు మార్చారు.
మహేశ్ భట్ మొదటి భార్య కిరణ్ భట్ కొడుకే రాహుల్ భట్. అతడు సినీ ఇండస్ట్రీకి సంబంధం లేకుండా తన కెరీర్ను కొనసాగిస్తున్నాడు. ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన ‘బిగ్బాస్-4’లో రాహుల్ భట్ పాల్గొన్నాడు. మహేశ్ భట్ రెండో భార్య సోనీ రజ్దాన్ కూతురే అలియా భట్ అన్న సంగతి తెలిసిందే.