అమితాబ్ ఒప్పుకోకపోతే ఈ సినిమానే చేయకపోయేవాడిని : అజయ్ దేవ్గణ్
ABN , First Publish Date - 2022-03-23T18:19:34+05:30 IST
బాలీవుడ్లో మంచి పాపులారిటీ ఉన్న నటుల్లో అజయ్ దేవ్గణ్ ఒకరు. అందులో ఎటువంటి సందేహం లేదు...
బాలీవుడ్లో మంచి పాపులారిటీ ఉన్న నటుల్లో అజయ్ దేవ్గణ్ ఒకరు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ హీరో ఏడాదికి రెండు, మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ నటుడు ప్రస్తుతం ‘రన్ వే 34’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాకి దర్శకుడు కూడా అజయే కావడం.
ఈ సినిమాలో అజయ్తో పాటు అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ని చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఈ సందర్భంగా అజయ్ దేవగణ్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నాడు. ఈ సినిమాకి మొదట దర్శకత్వం మాత్రమే చేయాలనుకున్నాడని, అనంతరం కొన్ని కారణాల వల్ల నటించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చాడు.
అజయ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాని నమ్మి అమితాబ్ నటించడానికి ఒప్పుకోకపోతే మరొకరిని ఆయన పాత్రలోకి తీసుకునేవాడిని కాదు. అంటే అసలు నేను ఈ చిత్రాన్ని చేసేవాడినే కాదు. కానీ ఆయన ఒప్పుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇంతకుముందు నా చిత్రం ‘మేజర్ సాబ్’ దర్శకుడు టిను ఆనంద్కి అనారోగ్యం కారణంగా కొన్ని సన్నివేశాలను అమితాబ్ని డైరెక్ట్ చేశాను. కానీ పూర్తి స్థాయిలో దర్శకత్వం వహించడం ఇదే మొదటి సారి. అయితే ఆయనతో కలిసి 8 సినిమాలకు పని చేశాను’ అని తెలిపాడు.
అజయ్ ఇంకా మాట్లాడుతూ.. ‘అమితాబ్లాగా కష్టపడి పనిచేసే నటుడిని నేను ఇంతవరకూ చూడలేదు కాబట్టి ఆయన గురించి ఎక్కువగా మాట్లాడలేను. అయితే ఆయన ఎనర్జీ, అంకితభావం ఎంతో అద్భుతమైనవి. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు కూడా సెట్లో వాటిని మర్చిపోవడానికి పని చేస్తారు. నేను ఆయన్ని కలిసిన ప్రతిసారీ ఇంకా కష్టపడటానికి, మరింత మెరుగ్గా పనిచేయడానికి ప్రేరణ పొందుతుంటాను’ అని చెప్పాడు.